నిజామాబాద్, మే 5, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు ఎంతో బాధ్యతగా ఉండాల్సి ఉంటుంది. విధుల దుర్వినియోగానికి దూరంగా ఉండడంతోపాటు రాజకీయ కార్యకలాపాల్లో సర్కారు ద్వారా జీతం తీసుకుంటున్న వారెవ్వరూ పాలు పంచుకోవద్దు. కానీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన ఐఎంఏ సమావేశం ఇప్పుడు తీవ్ర రాద్దాంతానికి దారి తీస్తోంది. ఇండియన్ మెడికల్ అసోషియేషన్ ద్వారా మీట్ విత్ డాక్టర్స్ పేరుతో బీజేపీ ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రత్యేకంగా ఓ ప్రైవేటు హోటల్లో సమావేశం ఏర్పాటు చేశారు. గుట్టు చప్పుడు కాకుండా మీడియాకు ఈ భేటీకి సంబంధించిన లీకులు బయట పెట్టకుండా బీజేపీ ప్రజా ప్రతినిధులు, ఐఎంఏ బాధ్యులంతా జాగ్రత్తలు తీసుకున్నారు. తీరా ఫొటోలు బయటికి రావడంతో కొంత మంది ప్రభుత్వ వైద్యులు ఈ రాజకీయ నాయకులతో అంటకాగుతూ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన భేటీలో పాల్గొనడం వివాదం రేగుతోంది. ఈ సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోనూ నిజామాబాద్ లోక్సభకు పోటీ చేస్తున్న ప్రస్తుత ఎంపీ అర్వింద్తో మీట్ విత్ డాక్టర్స్… అంటూ ప్రదర్శించారు. ఇందులో అనేక మంది ప్రైవేటు డాక్టర్లు ఉన్నప్పటికీ అదేం వివాదం కావడం లేదు. వారి వ్యక్తిగతమైన నిర్ణయంగానే అందరూ భావిస్తున్నారు. కాకపోతే బాధ్యతాయుతమైన ప్రభుత్వ వైద్యులుగా ఉన్న వారే ఇందులో పాలుపంచుకోవడంపై చర్చ నడుస్తోంది. ప్రభుత్వ డాక్టర్లుగా విధులు నిర్వహిస్తూ ఓ పార్టీ కార్యక్రమానికి హాజరవ్వడం ఏమిటంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఉద్యోగులెవ్వరూ రాజకీయ నాయకులు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనరాదు. ఈసీ నిబంధనల మేరకు అలాంటి వాటికి దూరంగా ఉండాలి. అలా పాల్గొంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుంది.