ఎల్లారెడ్డి, మే 18 ;ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను తమ పార్టీలోకి చేర్చుకొని అధికారం దక్కించుకోవాలనుకున్న కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీని చేజిక్కించుకోవాలనుకున్న హస్తం నేతలకు ఊహించని పరిణామం ఎదురైంది. మున్సిపల్ చైర్మన్నే తమ పార్టీలో చేర్చుకోవడంతో ఇతరులను కూడా తమ పార్టీలో చేర్చుకొని సునాయాసంగా మున్సిపాలిటీపై తమ జెండా ఎగురవేయొచ్చని అనుకున్న వారి ప్రయత్నాలపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు నీళ్లు చల్లారు. ఏకంగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ల మద్దతును కూడగట్టిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు.. అవిశ్వాసం నెగ్గి కాంగ్రెస్ పెద్దల ఆలోచనలకు చెక్పెట్టారు.
ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం శనివారం నెగ్గింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కుడుముల సత్యం పదవి కోల్పోవడం ఆయనకు, ఆయన మద్దతుదారులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. మున్సిపాలిటీలో 12మంది కౌన్సిలర్లుండగా 11 మంది కౌన్సిలర్లు సత్యంపై అవిశ్వాసం కోరుతూ గత నెల 24న కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 18న అవిశ్వాసంపై సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ పూర్తికాగానే 11 మంది కౌన్సిలర్లతోపాటు వారి కుటుంబసభ్యులు విహారయాత్రకు వెళ్లారు. అవిశ్వాస సమావేశానికి సమయం దగ్గర పడుతున్న తరుణంలో చైర్మన్ కుడుముల సత్యంకు కనీసం ఒక్క కౌన్సిలర్ కూడా అందుబాటులో లేరు. దీంతో సమావేశాన్ని వాయిదా వేయించేందుకు న్యాయస్థానం మెట్లు ఎక్కారు. అక్కడ సైతం ఆయనకు చుక్కెదురైంది. నాలుగైదు రోజులపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో విహరించిన కౌన్సిలర్ల కుటుంబాలు శనివారం ఉదయం పది గంటలకు సమావేశ ప్రాంగణమైన ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి చేరుకున్నారు. సమావేశాన్ని ప్రారంభించిన ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్ మొదట కౌన్సిలర్ల సంతకాలు సేకరించారు. అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని, అవిశ్వాసానికి మద్దతు పలికేవారు చేతులు ఎత్తాలని పేర్కొనడంతో సమావేశానికి హాజరైన 11 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. దీంతో ఆర్డీవో ప్రభాకర్ చేతులు ఎత్తిన వారి సంఖ్యను లెక్కించి సమావేశం పూర్తయ్యిందని, సమావేశానికి సంబంధించిన వివరాలను కలెక్టర్కు నివేదిస్తామని పేర్కొని కౌన్సిలర్లను బయటికి పంపించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జూన్ 14 తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని కౌన్సిలర్లతో పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఊహించని పరిణామం…
అధికార కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీ చైర్మన్ కుడుముల సత్యంపై అవిశ్వాసం నెగ్గడం ఊహించని పరిణామమని స్థానికులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్లో ఉన్న చైర్మన్ను పదవి నుంచి దించడంతో ప్రతిపక్షంలోని బీఆర్ఎస్కు ఇక్కడ పట్టు ఉన్నట్లేనని అభిప్రాయపడుతున్నారు. మొదట మెజారిటీ కౌన్సిలర్లు బీఆర్ఎస్కు చెందిన వారు కావడంతో ఎల్లారెడ్డి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో చైర్మన్ సత్యం ఆ పార్టీలో చేరగా.. అతనికి ఏ ఒక్కరూ మద్దతు పలుకలేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు సైతం అవిశ్వాసానికే మద్దతు పలుకడం గమనార్హం. చైర్మన్ పదవిపై అవిశ్వాసమని తెలిసినా సొంత పార్టీ కౌన్సిలర్లను కాపాడుకోవడంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ విఫలమైనట్లు ఆ పార్టీకి చెందినవారే గుసగుసలాడుతున్నారు.
అవిశ్వాసంలో విజయం సాధించాం..
ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యంపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానానికి 11 మంది కౌన్సిలర్ల మద్దతు లభించిందని, తాము విజయం సాధించామని కౌన్సిలర్ పద్మ శ్రీకాంత్ అన్నారు. సమావేశం అనంతరం ఆయన మున్సిపాలిటీ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. చైర్మన్కు వ్యతిరేకంగా తాము ఏకంగా ఉన్నామని, శనివారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా 11మంది కౌన్సిలర్లు మద్దతుగా నిలిచామన్నారు. ఇది అందరి విజయమని ఆయన పేర్కొన్నారు.