కామారెడ్డి/ కంఠేశ్వర్,మే 18: జూన్ 9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం.మహేందర్ రెడ్డి కలెక్టర్లు, సంబంధిత అధికారులను ఆదేశించారు. టీఎస్పీఎస్సీ కమిషన్ సభ్యులతో కలిసి శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సజావుగా నిర్వహించాలని తెలిపారు. గత రెండుసార్లు పొరపాట్లు జరిగాయని, అవి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలన్నారు. బయోమెట్రిక్ హాజరు నమోదు దృష్ట్యా ఉదయం 9 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుందని, అభ్యర్థులు రెండు గంటల ముందుగా వచ్చేలా చూసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 10గంటల తర్వాత కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో 4,792 మంది అభ్యర్థుల కోసం 12 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు పరీక్ష సజావుగా నిర్వహించేందుకు లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లను నియమించామని తెలిపారు. బయెమెట్రిక్ యంత్రాలు ఒకరోజు ముందు జిల్లాకు వస్తే పరిశీలించి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. వీసీలో నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, సీపీ కల్మేశ్వర్ సింగెనవార్, కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ, అదనపు కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.