Malla Reddy | మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్థల వివాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. సుచిత్రలోని సర్వే నంబర్లు 82, 83లోని స్థలం వద్దకు వెళ్లిన రెవెన్యూ అధికారులు.. సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించారు. అలాగే ల్యాండ్ సర్వే కూడా చేస్తున్నారు. కాగా, ఎలాంటి వివాదం తలెత్తకూడదనే ఉద్దేశంతో అక్కడికి ముందుగానే పోలీసులు మోహరించారు. పరిసర ప్రాంతాల్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని స్టేట్మెంట్ రికార్డు చేశారు.
అయితే నోటీసులు ఇవ్వకుండానే రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టడాన్ని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తప్పుబట్టారు. 13 ఏళ్ల క్రితమే ఆ భూమిని కొన్నామని.. ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కడుతున్నామని చెప్పారు. 2011లో తాను, మల్లారెడ్డి ఈ భూమిని కొన్నామని తెలిపారు. అప్పటికి తాము రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. కొందరు కావాలనే వివాదం సృష్టిస్తున్నారని.. లీగల్గా రమ్మంటే దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు.
కాగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సర్వే నంబర్ 82లోని 1.29 గుంటల స్థలంతో పాటు సర్వే నంబర్ 83లో మూడు వేల గజాల స్థలాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి 2011లో కొనుగోలు చేశారు. దూల్చంద్ అనే వ్యక్తి నుంచి తన అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి, తన కొడుకు భద్రారెడ్డి పేరిట మల్లారెడ్డి కొనుగోలుచేశారు. అప్పట్నుంచి ఆ స్థలాన్ని ప్రైవేటు వాహనాల పార్కింగ్కు కిరాయికి ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఈ సర్వే నంబర్లో తమ స్థలం ఉందని ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానంలో కేసు పెండింగ్లో ఉంది.
అయితే కోర్టులకు సెలవులు ఉండటాన్ని అనుకూలంగా మలచుకున్న పలువురు శుక్రవారం అర్ధరాత్రి దౌర్జన్యంగా ఆ స్థలంలో ప్రవేశించారు. సుమారు 50 మంది వచ్చి ప్రధాన గేటును ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి యత్నించారు. సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేశారు. జేసీబీ తీసుకొచ్చి అందులో ఉన్న షెడ్డు, ఇతర నిర్మాణాలను కూల్చివేశారు. అదే స్థలంలో రాత్రి రాత్రే తాత్కాలిక రేకులతో ప్రహారీని నిర్మించారు. శనివారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డితో పాటు భద్రారెడ్డి, ఇతరులు ఘటనాస్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.
స్థలం మధ్యలో వెలసిన అక్రమ ప్రహారీ నిర్మాణాన్ని మల్లారెడ్డి అనుచరులు తొలగించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు వారిని అదుపు చేశారు. ఇక ఈ వివాదంపై పేట్ బషీరాబాద్ పోలీసులు స్థలం హద్దుల కోసం రెవెన్యూ అధికార యంత్రాంగం సహాయం తీసుకున్నారు.