కుత్బుల్లాపూర్,అక్టోబర్12: గేర్ వేసి తీసే లోపే గుంత …ఏ మాత్రం నిర్లక్ష్యంగా నడిపినా వాహనాలు ఆగాల్సిందే. ఇక బైక్లు అదపుతప్పితే కింద పడాల్సిందే. అడుగడుగునా గుంతలగా మారిన ఈ దారిపై కాస్త జాగ్రత్తగా వెళ్లకతప్పదు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. ఈ క్రమంలో కిలోమీటర్ల మేరా ఈ గుంతలతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. సరిగ్గా కొంపల్లి చౌరస్తా నుంచి దూలపల్లి గ్రామం వరకు ఇలాంటి గుంతలు అత్యధికంగా దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు మార్గమధ్యలో ఉన్న కల్వర్టు వద్ద మరీ అధ్వానంగా ఉంది. ఎదుటి వాహనాలు వెళ్లాకే పక్కన ఉన్న వాహనాలు ముందుకు కదలాల్సిన పరిస్థితి ఉంది.గుంతలమయంగా మారిన రోడ్డుతో గ్రామస్తులతో పాటు వాహనదారులు దినదినం నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. రాత్రయిందంటే చాలు ఈ రోడ్డు గుండా ప్రయాణాలు సాగించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుఒని వెళ్లకతప్పదు. ఏమాత్రం అజాత్త్రగా వెళ్లినా ప్రమాదాన్ని కొని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకుంటుందని స్థానికులు చెబుతున్నారు.
అధికలోడ్తో వాహనాలు..మన్నిక తక్కువ రోడ్డు..
కొంపల్లి చౌరస్తా నుంచి దూలపల్లి మీదుగా జీడిమెట్ల పారిశ్రామిక వాడతో పాటు ఎదురుగా ఫారెస్ట్ అకాడమీ వరకు ప్రధాన రోడ్డుపై గుంతలతో కంకరతేలి దర్శనమిస్తున్నాయి. దూలపల్లి గ్రామ చౌరస్తా నుంచి మూడు వైపులా పూర్తిగా రోడ్డంతా గుంతలు పడడంతో అటు పాదచారులు, ఇటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిత్యం ఈ రోడ్డు గుండా వందలాదిగా వచ్చి పోయే వాహనలతో పాటు పారిశ్రామిక వాడల్లోకి వెళ్లే ట్రక్లారీలు వెళుతుండడంతో రోడ్డు మరీ అధ్వానంగా తయారైంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గుంతలమయంగా మారిన రోడ్డును మరమ్మతులు చే యాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.