బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెప్పపాటు కూడా పోకుండా వచ్చిన కరెంటులో ఇప్పుడెందుకు కోతలు పడుతున్నయి? నల్లా నీళ్లు ఎందుకు మాయమైపోయినయి? సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడపోయింది? కల్యాణలక్ష్మి చెక్కులు ఎక్కడికి పోయినయ్. ఎందుకు మాయమైనయ్? రైతుబంధు ఎటు పోయింది? రైతుబంధు కోసం పెట్టిన నిధులు ఎటు పోయినయ్? ఐదు నెలల ముందు తెలంగాణ ఎట్లా ఉండె? ఈ ఐదు నెలల్లో ఇంత ఆగం ఎందుకైంది?
– కేసీఆర్
KCR | హైదరాబాద్, మే4 (నమస్తే తెలంగాణ): గిరిజనుల కోసం, ప్రజల కోసం, మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైన మాట చెప్తున్నదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. పాత ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని, ఎన్నికల మర్నాడే మంచిర్యాల, నిర్మల్ జిల్లాలను రద్దుచేస్తానని ఈ ముఖ్యమంత్రి అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల కోసం యుద్ధం చేద్దామని, మంచిర్యాల జిల్లాగా ఉండాలంటే ఈ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని కోరారు. బస్సుయాత్రలో భాగంగా చెన్నూరు ఐబీ చౌరస్తాలో శనివారం నిర్వహించిన రోడ్షోలో కేసీఆర్ మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల కల అయిన మంచిర్యాల జిల్లాను కేసీఆర్ తెచ్చిండని, దీనిని రద్దుచేస్తే మళ్లీ కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ ఆదిలాబాద్ దారి పట్టాలా? అని ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా కోసం కొట్లాడుదామా? యుద్ధం చేద్దామా? అని ప్రశ్నించారు. మా మంచిర్యాల జిల్లా మాకు ఉండాలంటే బ్యాలెట్ యుద్ధం చేసి ఈశ్వర్ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే తెలంగాణ ఆగమైందని కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. తాగు, సాగునీళ్లు, కరెంటుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో రెప్పపాటు సమయం కూడా కరెంటు ఇప్పుడెందుకు పోతున్నదని ప్రశ్నించారు. నల్లా నీళ్లు ఎక్కడ మాయమయ్యాయని, సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడికి పోయిందని, కల్యాణలక్ష్మి చెక్కులు ఎక్కడికి పోయాయని నిలదీశారు. రైతుబంధు ఎటుపోయింది? అందుకోసం పెట్టిన నిధులు ఎటుపోయాయని ప్రశ్నించారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని చెప్పి, అడ్డగోలు హామీలిచ్చి, నోటికి ఏది వస్తే అది చెప్పిన సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏ రోజు ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి గుడిలో ఒట్లు వేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
డిసెంబర్ 9 పోయింది, వంద రోజులు పోయాయని, ఇప్పుడు మళ్లీ ఆగస్టు 15 అంటున్నాడని, నమ్మవచ్చునా? అని నిప్పులు చెరిగారు. ‘రుణమాఫీ అయ్యిందా? రైతుబంధు అందరికీ వచ్చిందా? 2500 ప్రతి మహిళకు వచ్చిందా? కల్యాణలక్ష్మి తులం బంగారం వచ్చిందా? అని కేసీఆర్ ప్రశ్నించగా ‘లేదు.. లేదు’ అని రోడ్షోకు హాజరైన ప్రజలు బదులిచ్చారు. ‘కరెంటు పోతున్నదా? కోతలు మొదలయ్యాయా?’ అని ప్రశ్నించగా ‘అవును’ అంటూ బదులిచ్చారు. ఆరు గ్యారెంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. అటు మంచినీళ్లు రాక, ఇటు సాగునీళ్లు, కరెంటు ఇవ్వక లక్షల ఎకరాల్లో పంటలను ఎండబెట్టారని, కనీసం కష్టపడి పండించిన పంటలను కూడా కొనే దిక్కులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. వరికి 500 బోనస్ వస్తున్నదా? అని ఎక్కడ అడిగినా లేదనే చెప్తున్నారని, బోనస్ బోగస్ అయ్యిందని, మద్దతు ధర కూడా లేక రైతులు చచ్చిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
సింగరేణిని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతున్నది. ముఖ్యమంత్రి దావోస్, స్విట్జర్లాండ్లో మాట ముచ్చట మాట్లాడి అగ్రిమెంట్ చేసుకున్నడు. తెలంగాణ కొంగుబంగారమైన సింగరేణి పోతే మన బతుకులు ఎలా ఉంటాయో ఆలోచించాలి. -కేసీఆర్
బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరు మీద పల్లెలు, పట్టణాలను అభివృద్ధి చేసుకున్నామని కేసీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు పంచాయతీలకు డబ్బులు ఇవ్వడం లేదని, మున్సిపాల్టీల్లో ఊడ్చే పరిస్థితి కూడా లేదని, ఎక్కడికక్కడ చెత్త పేరుకుని పోతున్నదని, హరితహారం చెట్లు, పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతున్నాయని, యువకుల కోసం పెట్టిన క్రీడా ప్రాంగణాల్లో చెట్లు మొలుస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రారంభించిన చెన్నూరు ఎత్తిపోతల పథకాన్ని కూడా ఆపేశారని, మంచిర్యాల ప్రజల కోసం వెజ్, నాన్వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు చేపడితే అవి కూడా మొండిగోడలకే పరిమితమయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఎందుకు ఆపేసిందని నిలదీశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజలకు ఉపయోగపడే అన్నిరకాల పనులను నిలిపివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కనీసం స్ట్రీట్లైట్లు పోతే వాటిని రిపేర్ చేసే పరిస్థితి లేదు. సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులు లేవు. కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు బంద్ చేశారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు స్కాలర్షిప్లు బంద్ చేశారు. కొత్త మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు తెస్తలేరు. ఐదు నెలలుగా అన్ని రంగాల్లోనూ పనులు నిలిపివేశారు. ఏ ప్రభుత్వం చేసినా ప్రజలకు సంబంధించిన మంచి పనులు ఉంటే కొనసాగిస్తరు. కానీ ఈ మూర్ఖపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బాగోగులు పట్టించుకోకుండా జిల్లాలను రద్దు చేస్తాం. కాంప్లెక్స్లు, చెన్నూరు లిఫ్ట్, తాగునీళ్ల స్కీంలను ఆపేస్తమని చెప్తున్నది. కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేస్తా అని ముఖ్యమంత్రి అంటున్నడు’ అని నిప్పులు చెరిగారు.
తాను గోదావరిఖనిలో చెప్పిన దాన్నే మళ్లీ చెప్తున్నానని, ఆ రోజు ప్రధాని మోదీ తన మెడమీద కత్తిపెట్టి ఆస్ట్రేలియా బొగ్గు, అదానీ బొగ్గు కొనాలని చెప్పినా తాము కొనలేదని, కానీ ఈ రోజు ఈ ముఖ్యమంత్రి పోయి అదానీని ఆహ్వానించాడని కేసీఆర్ మండిపడ్డారు. దావోస్లో, స్విట్జర్లాండ్లో మాట ముచ్చట మాట్లాడి అగ్రిమెంట్ చేసుకున్నారని ఆరోపించారు. సింగరేణిని కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ కొంగుబంగారమైన సింగరేణి పోతే మన బతుకులు ఎలా ఉంటాయో ఆలోచించాలని కోరారు. కొప్పుల ఈశ్వర్ 26 ఏండ్లు సింగరేణి కార్మికుడిగా పనిచేశారని, ఆయన గెలిస్తే సింగరేణిని కాపాడతాడని భరోసా ఇచ్చారు.
గోదావరిఖని, మే 5 : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనికి వచ్చిన కేసీఆర్ శనివారం రాత్రి మంచిర్యాల రోడ్డుషోకు వెళ్తూ పట్టణ సమీపంలోని గోదావరి బ్రిడ్జిపై నుంచి రెండు నిమిషాల పాటు నదిని పరిశీలించారు. నదీ మాతకు బ్రిడ్జిపై నుంచి సారెను సమర్పించారు. గతంలో నిండుకుండలా ఉన్న నది ఇప్పుడు నీళ్లు తగ్గి ఉండడం చూసి ఆవేదన చెందారు. అంతకు ముందు భారీ సంఖ్యలో మహిళలు మంగళ హారతులతో కేసీఆర్కు స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్, నాయకులు కౌశికహరి, దాసరి ఉష ఉన్నారు.
బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టామని, నేడు వాటిని చూసే దిక్కులేదని, పిల్లలు విష ఆహారం తిని దవాఖానల పాలవుతున్నారని, కొన్ని చోట్ల చనిపోతున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. అన్నిరకాల నిర్లక్ష్యం, ఒక అహంకారం, మొండి, మూర్ఖపు వైఖరితో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను శిక్షిస్తున్నదని దుయ్యబట్టారు. ‘రేపు రైతుబంధు ఐదు ఎకరాలే వేస్తా అంటడు. మరి ఆరెకరాలు, ఏడెకరాలు ఉన్నవాళ్లు ఏం పాపం చేశారు? వాళ్లకు రైతుబంధు రావద్దా? గోదావరి నదిని నరేంద్రమోదీ ఎత్కపోతా అంటున్నడు. అన్యాయం చేస్తామంటున్నడు. ఊరుకుందామా? ఈ ముఖ్యమంత్రి కుయ్యిలేదు. కృష్ణను తీస్కపోయి ఇప్పటికే అప్పగించిండు. గోదావరిపై నోరు తెరుస్తలేడు. కృష్ణా, గోదావరి పోతే మనలను ఎవరు కాపాడాలె? ఏవిధంగా కాపాడాలె? పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాల్సిన ఆవశ్యకత ఉన్నది.
తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలన్నా? నదుల నీళ్లలో మన హక్కులు మనకు రావాలన్నా? ఢిల్లీ నుంచి నిధులను తేవాలన్నా? మనం బతకాలన్నా? సింగరేణి ప్రైవేట్ పరం కావద్దన్నా? మళ్లా యథావిధిగా తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు జరగాలన్నా తప్పకుండా బీఆర్ఎస్ గెలవాలి. బీఆర్ఎస్కు మీరిచ్చే బలమే నా బలం’ అని కేసీఆర్ వివరించారు. ‘కాంగ్రెస్ మోసాలపై నిలదీస్తుంటే ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతున్నడు. కేసీఆర్.. నీ గుడ్లు తీస్కొని గోలీలు అడతా? పేగులు మెడలో వేసుకుంటా? నీ లాగుల తొండలు ఎక్కిస్తా? నిన్ను జైలులో వేస్తా? అని అంటుండు. నేను జైళ్లకు భయపడతనా? భయపడితే రాష్ట్రం వచ్చేదా? చావునోట్లో తలపెట్టి, 15ఏళ్లు రాజీలేని పోరాటం చేసి, మీ బిడ్డగా తెలంగాణను తీస్కొచ్చిన. నా ముందే తెలంగాణకు అన్యాయం చేస్తమంటే, నా ప్రాణాలను బలిపెట్టయినా సరే పోరాడతా తప్ప మౌనంగా ఉండే ప్రసక్తే లేదు’ అని కేసీఆర్ స్పష్టంచేశారు.
ఆరు గ్యారెంటీలని చెప్పి ఒక్కటే పెట్టారు. ఆ ఫ్రీ బస్సుతో ఆడవాళ్లు సిగలు పట్టుకుని కొట్టుకుంటున్నరు. ఈ పథకం వల్ల ఆటోరిక్షా బిడ్డల బతుకులు ఆగమైపోయాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్నరు.
-కేసీఆర్
దళితబిడ్డల కోసం దళితబంధు తెచ్చామని కేసీఆర్ వివరించారు. దళితబంధు తీసుకుని ఇప్పుడు నెలకు రూ.30వేలు సంపాదిస్తున్నానని గోదావరిఖనిలో ఓ యువతి చెబితే సంతోషం అనిపించిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 1.3 లక్షల మందికి దళితబంధు మంజూరు చేశామని, ఆ డబ్బులన్నీ రేవంత్రెడ్డి ప్రభుత్వం వాపస్ తీసుకున్నదని మండిపడ్డారు. ‘దళితులు అర్హులు కారా? ఎందుకు వాపస్ తీస్కున్నరు. ఎందుకు ఇవ్వడం లేదు. గిరిజన బిడ్డలకు 4.5 లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలు ఇచ్చినం. రైతుబంధు, రైతుబీమా చేసినం. ఇవాళ ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. ఒక్క రూపాయి కూడా రైతుబంధు వెయ్యలె. అటు గిరిజనులు, ఇటు దళితులను ఈ ప్రభుత్వం మోసం చేస్తున్నది. ముస్లింలకు ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా పంపించినం. ఈ సంవత్సరం వచ్చిందా? ఇఫ్తార్ విందులు జరిగినయా? వాళ్లు ఎవరినీ గౌరవించరు. హిందువులను, ముస్లింలను, దళితులను గౌరవించరు? లంబాడా గిరిజనులకు ఇవ్వాల్సింది ఇవ్వరు. రైతులను, విద్యార్థులను ముంచుతరు. రాక్షస పాలనను కొనసాగుతున్నది. ఈ అన్యాయాలను అరికట్టాలంటే, న్యాయం జరగాలంటే బీఆర్ఎస్ గెలివాలి. మీ తరపున గొంతెత్తి పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ’ అని వివరించారు.
ముస్లింలకు మేం ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా పంపినం. ఈ సంవత్సరం వారు పంపలే. ఇఫ్తార్ విందులు జరగలే. వాళ్లు ఎవరినీ గౌరవించరు. హిందువు, ముస్లింలు, దళితులను గౌరవించరు. లంబాడా గిరిజనులను గౌరవించరు.
-కేసీఆర్
నరేంద్రమోదీ పదేండ్ల క్రితం గెలిచినప్పుడు ఇంటికి రూ.15 లక్షలు ఇస్తామన్నాడని, మరి ఇంటింటికీ 15 లక్షలు వచ్చినయా అని కేసీఆర్ ప్రశ్నించారు. అందుకు జనం.. ‘లేదు.. లేదు’ అని బదులిచ్చారు. ‘నిజంగా రాలేదా? మంచిర్యాలలో వచ్చినయట కదా’ అని ఎద్దేవా చేశారు. ‘భేటీ పడావో.. భేటీ బచావో’, ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ ఏమైనా అయిందా? అని ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు అయిందా? అని ప్రశ్నించారు. నరేంద్రమోదీది అంతా గ్యాస్ తప్ప మరేమీ లేదని, బీజేపీకి ఓటేసినా, గోదాట్లో పడేసినా తేడా ఏమీ ఉండదని పేర్కొన్నారు.
పెద్దపల్లి లోక్సభ ఎన్నికల్లో పోటీ ఒక ఆగర్భ శ్రీమంతుడికి, ఒక భూగర్భ కార్మికుడికి మధ్య పోటీ జరుగుతున్నదని కేసీఆర్ తెలిపారు. ఆగర్భ శ్రీమంతుడు ఒకవైపు ఉంటే, 26 ఏండ్లు తట్ట పట్టుకొని, లైట్ పెట్టుకొని బొగ్గు మోసిన భూగర్భ కార్మికుడు మరోవైపు కొప్పుల ఈశ్వర్ మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారని తెలిపారు. కార్మికుడు గెలవాలా? శ్రీమంతుడు గెలవాలా? అనేది ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. సర్వేలన్నీ కొప్పుల ఈశ్వర్ గెలిచినట్టే చెప్తున్నాయని, ఆ విజయాన్ని ఖాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోమారు మోసపోయి గోసపడొద్దని ప్రజలకు సూచించారు. అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని, బీజేపీతో మనకు ఏం ఒరగలేదని, బీఆర్ఎస్సే తెలంగాణకు శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. తెలంగాణ తెస్తానని ఆనాడు చెప్పానని, తెలంగాణ హక్కులు కాపాడతానని ఇప్పుడు చెపుతున్నానని తెలిపారు. 45 డిగ్రీల ఎండ ఉన్నా మంచిర్యాల చరిత్రలో ఎన్నడు లేని విధంగా చౌరస్తా ఈనిందా అన్న విధంగా ఇంత పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలకు ధన్యవాదాలంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.