ముషీరాబాద్, మే 4: సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో ఇంకోసారి గెలిచి మరో చరిత్రను తిరగరాయబోతున్నదని ఆ పార్టీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా కిషన్రెడ్డి రాష్ర్టానికి చేసిందేమీలేదని, కాంగ్రెస్కు ఓటు వేస్తే వృథాగా పోతుందన్నారు. శనివారం ఆయన ముషీరాబాద్ డివిజన్ బాపూజీ నగర్ స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికంగా ఉన్న ప్రొ. జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఇంటింటికీ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ, ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పరుగెత్తే అవకాశవాద కాంగ్రెస్ అభ్యర్థికి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పబోతున్నారని, ఆయన ఓడిపోవడం ఖాయమని అన్నారు.
బీజేపీ అభ్యర్థి ఐదేళ్లు అందుబాటులో లేడని ఆయనకు మరోసారి ఓటు వేస్తే మరో ఐదేళ్లు కనిపించకుండా పోతారని ఆరోపించారు. జనం మధ్య నాయకున్నే ప్రజలు కోరుకుంటున్నారని, గెలిచాక ముఖం చాటేసే నాయకులు మనకు వద్దంటున్నారని తెలిపారు. గత 40 ఏండ్లుగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వాములుగా ఉన్నానని తెలిపారు. అందువల్లే ఎక్కడికి వెళ్లినా ప్రచారంలో ప్రజలు మంగళ హారతులు ఇస్తూ సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా సేవే లక్ష్యంగా పనిచేస్తున్నందుకే ప్రజల నుంచి మంచి స్పందన, ఆదరణ లభిస్తుందన్నారు. స్థానికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రచార బాధ్యతలను తమ భుజ స్కందాలపై వేసుకొని తనకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారని అన్నారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే ప్రచారం సగం భాగం పూర్తయ్యిందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు జీపు యాత్రలు చేస్తే తాను పాదయాత్రలు చేసి నేరుగా ఓటర్లను కలుస్తున్నానని తెలిపారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని, అందువల్లే ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. పద్మారావు గౌడ్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్రెడ్డి, బీఆర్ఎస్ యువజన నాయకుడు ముఠా జయసింహా, ఎడ్ల హరిబాబు యాదవ్, రాజీవ్ సాగర్, టి.సోమసుందర్, మాజీ కార్పొరేటర్ వి. శ్రీనివాస్ రెడ్డి, ముషీరాబాద్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీధర్రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, మీడియా సెల్ ఇన్చార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, దీన్దయాల్రెడ్డి, ఎయిర్టెల్ రాజు, బల్ల ప్రశాంత్, వై. శ్రీనివాసరావు, బల్ల శ్రీనివాస్ రెడ్డి, రాకేశ్ కుమా ర్, వల్లాల శ్యామ్ యాదవ్ పాల్గొన్నారు.