సిటీబ్యూరో, మే 4(నమస్తే తెలంగాణ): ప్రస్తుత వేసవి సీజన్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడంతో విద్యుత్ డిమాండు, వినియోగం అనూహ్యంగా పెరుగుతోందని, ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ శాఖ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ అధికారులను ఆదేశించారు. శనివారం ఖైరతాబాద్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో డిస్కం చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్లో ఈ వేసవి సీజన్లో ఏప్రిల్ 30న 4214 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండు నమోదు కాగా, మే 3న 89.71 మిలియన్ యూనిట్ల అత్యధిక వినియోగం నమోదైందన్నారు. గతేడాదితో పోల్చుకుంటే 53.7 శాతం అధికం. శనివారం సైతం 4209 మెగావాట్ల ఫీక్ అవర్ డిమాండు నమోదైంది. ఈ సీజన్లో మే నెల ముగిసే వరకు అనూహ్యంగా మరింతగా విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ సీజన్ ముగిసే వరకు ప్రతి 11 కేవీ ఫీడర్కు ఇన్చార్జిగా ఒక ఇంజినీర్ను షిప్టుల వారీగా నియమించాలన్నారు.
దీనికి సంబంధించి సంస్థ ప్రధాన కార్యాలయంలో, ఇతర సర్కిల్, జోనల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న దాదాపు 300 ఇంజినీర్లను సైతం ఆపరేషన్ విధుల్లో నియమించామని తెలిపారు. వేసవి డిమాండు నేపథ్యంలో ఇప్పటికే 4353 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ (డిటీఆర్)లు అదనంగా ఏర్పాటు చేశామన్నారు. వీటిని అదనంగా 250 డీటీఆర్లు క్షేత్ర స్థాయి కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. అవసరమైన చోట విద్యుత్ సిబ్బంది వాటిని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసి వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్చార్జి డైరెక్టర్లు కె.రాములు, ఎన్.నర్సింహులు, నందకుమార్, సుధా మాధురి, చీఫ్ జనరల్ మేనేజర్లు, ఎస్ఈలు, డివిజినల్ ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.