సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : మాస్టర్ ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో మౌలిక వసతుల కల్పనలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ విఫలమైంది. ఉప్పల్ మెట్రో డిపో, నాగోల్ మెట్రోస్టేషన్ ఇరువైపులా సుమారు 430కి పైగా ఎకరాల్లో మూసీ వెంబడి హెచ్ఎండీఏ భారీ లేఅవుట్ను అభివృద్ధి చేసింది. ఇందులో అత్యంత విశాలమైన 150, 120, 80, 60 ఫీట్ల వెడల్పుతో కూడిన రోడ్లను, మూసీ వెంబడి తీరం ప్రాంతంలో 3 కి.మీ పొడవైన పార్కును అభివృద్ధి చేశారు. నివాసాలకు అత్యంత అనువుగా ఉండడంతో పెద్ద ఎత్తున వ్యక్తిగత ఇళ్ల నిర్మాణంతో పాటు అపార్టుమెంట్లు, భారీ బహుళ అంతస్థుల భవనాలు ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో భారీ సంఖ్యలోనే పూర్తి చేసుకోగా, మరిన్ని పురోగతిలో ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధి జరుగుతున్నా దానికి అనుగుణంగా అవసరమైన మౌలిక వసతుల కల్పన, పారిశుధ్య నిర్వహణ సరిగా లేదు. దీంతో ఎంతో విశాలమైన రోడ్లతో కనిపించే ఉప్పల్ భగాయత్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో పాటు పొంగిపొర్లుతున్న మ్యాన్హోల్స్ దర్శనమిస్తున్నాయి. లేఅవుట్ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేసినా, ఈ ప్రాంత పరిధి జీహెచ్ఎంసీలోకి రావడంతో ఇక్కడ మౌలిక వసతుల కల్పన విషయంలో రెండు ప్రభుత్వ శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో ప్రస్తుతం వందలాది మంది ఇంటి పన్ను చెల్లిస్తున్నారు. అదేవిధంగా కొత్తగా నిర్మాణాలు చేపట్టే వారు భవన నిర్మాణాల అనుమతుల కోసం జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకుంటే లక్షల్లోనే ఫీజులు చెల్లిస్తున్నారు. ఇలా రెండు విధాలుగా ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తున్నా మౌలిక వసతుల కల్పనను ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఉప్పల్ భగాయత్లో పారిశుధ్య నిర్వహణ, మురుగునీటి పారుదల విషయాలను గాలికి వదిలేశారు. దీంతో ఎక్కడ చూసినా రోడ్ల వెంబడి చెత్తాచెదారం కనిపిస్తున్నది. ఉప్పల్ భగాయత్లో పలు చోట్ల మురుగునీరు గుంతల్లో నిండిపోయి దుర్వాసనకు తోడు దోమలు పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. వీటికి తోడు భద్రత పరంగానూ పోలీసు శాఖ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
మౌలిక వసతుల లేమికి తోడు కొందరు ఇష్టారాజ్యంగా ఖాళీ స్థలాల్లో అనుమతులు లేకుండా షెడ్లు వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విశాలమైన రోడ్ల వెంబడి ఉన్న ఫుట్పాత్లను సైతం అక్రమించి వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. దీంతో ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో సమస్యలు ఎదురవుతున్నాయని, ఈ విషయమై హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.