హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): వేసవిలో ఎప్పుడూ లేనంతగా మంగళవారం రాష్ట్రంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. మధ్యాహ్నం వరకు ఎండ ఉండగా, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. హైదరాబాద్లో మూడు గంటలపాటు కురిసిన భారీ వర్షం కురిసింది. ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శేరిలింగంపల్లిలో అత్యధికంగా 10.8 సెం.మీ, కేపీహెచ్పీలో 10.73, సికింద్రాబాద్లో 8.4, అల్వాల్లో 7 సెం.మీ, గాజులరామారంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నల్లగొండ, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో 6 సెం.మీపైగా వాన కురిసినట్టు తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు పడ్డాయి.
రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో తొమ్మిది జిల్లాలకు హెవీ రైన్ అలర్ట్ ప్రకటించింది. ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. బుధవారం ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, నాగర్కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొన్నది.
హైదరాబాద్సహా పలు జిల్లాల్లో మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. పెద్దపల్లి, సిరిసిల్ల, మెదక్, జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కరీంనగర్తోపాటు మానకొండూరు, హుజూరాబాద్లో వానపడింది. పలు చోట్ల ఈదురుగాలులతో వడగండ్ల వానలు పడ్డాయి. పెద్దపల్లి, సిరిసిల్ల, బోయినపల్లి, వేములవాడ, జగిత్యాల జిల్లా మల్యాల, పెగడపల్లిలో ఈదురుగాలులతో పలుచోట్ల వాన కురిసింది. కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనకు భారీ వర్షం అంతరాయం కలిగించడంతో సభ రద్దు అయింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో వర్షం కురిసింది. ములుగు జిల్లా కన్నాయిగూడెం, ఏటూరునాగారం, తాడ్వాయి మండలాలు, కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో వాన కురిసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి, చింతలమానేపల్లి, పెంచికల్ పేట, కాగజ్నగర్, కౌటాలా, సిర్పూర్ (టీ)లో భారీ వర్షం కురిసింది. మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా కండ్లకోయ, దుండిగల్, గండిమైసమ్మతోపాటు మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో వానపడింది. మంచిర్యాల జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని రాయిలాపూర్ గ్రామ శివారులో గోడ కూలీ ఇద్దరు మేస్త్రీలు మృతిచెందారు. ఏపీకి చెందిన చింతపండు సుబ్రహ్మణ్యం(45), మాదాస్ నాగు (35) కోళ్ల ఫారం నిర్మాణ పనులు చేస్తుండగా వర్షం కురిసింది. గోడ ఒక్కసారిగా కూలి సుబ్రహ్మణ్యం, మాదాస్ నాగుపై శిథిలాలు పడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లిలో కుమ్మరి మల్లేశం(36) అనే రైతు పొలం వద్ద వేపచెట్టు కింద నిలబడి ఉండగా వేపచెట్టుపై పిడుగు పడడంతో మృతి చెందాడు. వరంగల్ నుంచి ఇల్లందకు వస్తున్న ట్రాక్టర్పై చెట్టు పడటంతో ట్రాక్టర్ డబ్బాలో కూర్చొని వస్తున్న ఇల్లందకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఆబర్ల దయాకర్(22)కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందాడు.
అత్యవసరమైతే 100కి డయల్ చేయండి
తెలంగాణవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పోలీసుశాఖ హెచ్చరికలు జారీచేసింది. పిడుగుల ప్రమాదం దృష్ట్యా చెట్ల కింద ఉండటం, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్తు స్తంభాలను తాకటం వంటివి చేయద్దని కోరారు. శిథిలావస్థలో ఉన్న భవనాలకు దూరంగా ఉండాలని, అత్యవసర సమయాల్లో డయల్ 100కు కాల్ చేయాలని కోరారు.
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులతో సమీక్షించారు. హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమవడం, ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్తు అంతరాయాలపై తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన అకడి నుంచే జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, సిటీ పోలీస్ కమిషనర్ కే శ్రీనివాసరెడ్డి, ట్రాన్స్ కో సీఎండీ ఎస్ఏఎం రిజ్వీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ముఖ్యమంత్రి.. వెంటనే సమస్యను పరిషరించి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో జలమయమైన కాలనీల్లో ప్రజలకు అవసరమైన చేయూతను అందించాలని సూచించారు.