Tech News | అన్నం ఉడికిందో, లేదో ఒక మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది. ఈ సూత్రాన్ని వ్యక్తులను అంచనా వేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ, పెద్దలు చెప్పిన ఈ మాట సోషల్ మీడియాకు మాత్రం వర్తించదు. ముఖ్యంగా డిస్ప్లే పిక్ చూసి వాళ్ల వ్యక్తిత్వాన్ని ఊహిస్తే తప్పులో కాలేసినట్టే! వాట్సాప్ నుంచి ఫేస్బుక్ వరకు అంతటా ఫేక్ డీపీలు రాజ్యమేలుతున్నాయి. ప్రొఫైల్ పిక్చర్లు మార్చి అమాయకులను ఏమార్చే నకిలీ అవతారులు అస్లీ ప్రమాదకారులు.
వాట్సాప్ అయినా, ఫేస్బుక్ అయినా ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోవడం కామనే! గ్యాలరీలో ఉన్న చిత్తరువులన్నీ జల్లెడపట్టి.. మంచి ఫొటో ఎంచుకొని.. ఫిల్టర్స్తో మెరుగులు దిద్ది డీపీగా పెట్టుకుంటారు. అందమైన ‘అవతార్’తో అందరి మెప్పూ పొందాలని ఆశిస్తారు. అలా అనుకోవడంలో ఏ తప్పూ లేదు. మరికొందరు తమ వ్యక్తిత్వాన్నీ, అభిరుచుల్నీ ప్రతిబింబించేలా డిస్ప్లే పిక్చర్స్ ఎంచుకుంటారు. మరికొందరు తమ వ్యక్తిగత వివరాలు, ఫొటోలు పబ్లిక్గా చూపడం ఇష్టం లేక.. ఇష్టదైవం ఫొటోనో, నచ్చిన నాయకుడి చిత్తరువునో డీపీగా పెట్టుకుంటారు. ఇదీ మంచి పద్ధతే! కానీ, కొందరు మాత్రం.. డీపీ నుంచి ప్రొఫైల్ వరకు అన్నీ నకిలీవే ఎంచుకుంటారు. అబ్బాయిలను టార్గెట్ చేయాలని అందమైన అమ్మాయిల ఫొటోలు ప్రొఫైల్ పిక్గా పెట్టుకుంటారు. స్కామ్లు చేయడమే పనిగా పెట్టుకున్న వాళ్లు తమ సొంత పిక్చర్ డీపీగా పెట్టుకోరు. ముగ్ధమోహన రూపాన్ని ఎరగా వేసి చాటింగ్లోకి దింపుతారు. అదంతా చీటింగ్ అని తెలిసేలోగా.. వాళ్లకు కావాల్సిన సమాచారం కొల్లగొడతారు. మరికొందరు సెలెబ్రిటీలను టార్గెట్ చేయడమే లక్ష్యంగా ఫేక్ డీపీ పెట్టుకుంటారు. సదరు సెలెబ్రిటీ ఇష్టాయిష్టాల గురించి తెలుసుకొని.. వాళ్లు ఫోకస్ చేసే పిక్చర్స్ను అవతార్గా పెడుతుంటారు.
డిస్ప్లే పిక్చర్స్ చుట్టూ జరుగుతున్న అకృత్యాలు మన ఊహకు అందవు. ఆ స్థాయిలో నేరాలకు పాల్పడుతున్నారు ఫ్రాడ్స్టర్లు. ఉదయ్ (పేరు మార్చాం)కి ఎదురైన అనుభవమే ఇందుకు ఉదాహరణ. ఉదయ్ తన జీవితభాగస్వామితో దిగిన చిత్తరువును ఎఫ్బీ డీపీగా పెట్టుకున్నాడు. ఆ ప్రొఫైల్ పిక్చర్ను తీసుకొని, మార్ఫింగ్ చేసి అతనికే పంపారు ఫ్రాడ్స్టర్లు. తాము అడిగిన మొత్తం ఇవ్వకపోతే తన జీవితభాగస్వామి అశ్లీల చిత్రాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తామంటూ బెదిరించారు. వాళ్ల హెచ్చరికలకు కంగారుపడిన ఉదయ్.. వాళ్లు అడిగిన మొత్తం పంపి బతుకు జీవుడా అనుకున్నాడు. ప్రైవసీ సెట్టింగ్స్లో పకడ్బందీ ఆప్షన్స్ ఎనేబుల్ చేయకపోవడం వల్ల ఉదయ్కి ఇలాంటి పరిస్థితి ఎదురైంది.
మరికొందరు ప్రముఖుల చిత్తరువులు డీపీగా పెట్టుకొని స్కామ్లకు పాల్పడుతుంటారు. కంపెనీ సీఈవోలు, ఎండీల ఫొటోలు వాట్సాప్ డీపీగా వాడుకుంటారు. ఆయా కంపెనీ ఉద్యోగులను తియ్యగా పలకరిస్తారు. సీఈవో స్థాయి వ్యక్తి తమకు మెసేజ్ చేశాడన్న ఆనందంలోంచి తేరుకోకముందే.. ముంచేసే ప్రణాళిక అమలుచేస్తారు. కంపెనీ నుంచి గిఫ్ట్ వోచర్స్ పంపి కొనుగోలు చేయాల్సిందిగా చెబుతారు. అసలు సీఈవోనే ఆఫర్ చేశాడనుకొని వోచర్స్ కొనేస్తారు. ఆ వోచర్స్ పంపింది అసలు సీఈవో కాదని తెలిసే లోపు.. బాధితుల సంఖ్య ఇంతలంతలు అవుతుంది.
డిస్ప్లే పిక్ దుర్వినియోగం అయిందని అనుమానం వస్తే ఆయా సామాజిక మాధ్యమాల్లోని ఆప్షన్స్ ఆధారంగా రిపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. మీ డీపీని అనైతిక కార్యకలాపాలకు వాడుకున్నట్టుగా మీ దృష్టికి వస్తే బెంబేలెత్తిపోకుండా.. వెంటనే సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించి, ఫిర్యాదు చేయండి.
-అనిల్ రాచమల్ల వ్యవస్థాపకులు
ఎండ్నౌ ఫౌండేషన్