సిద్దిపేట/కరీంనగర్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): నాడు ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన రేవంత్రెడ్డి.. నేడు ఓటు కోసం దేవుళ్లపై ఒట్టు పెడుతున్నారని మాజీమంత్రి హరీశ్రావు ఆరోపించారు. బీఆర్ఎస్ 24వ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా శనివారం సిద్దిపేటలోని పార్టీ కార్యాలయంలో గులాబీ జెండాను ఎగురవేశారు. అనంతరం కరీంనగర్లో నిర్వహించిన ఇంటింటా ప్రచారంలో భాగంగా పాదయాత్ర చేశారు. ఈ సందర్భాల్లో మాట్లాడిన హరీశ్.. ఓటమి భయంతోనే సీఎం రేవంత్ దేవుళ్లపై ఒట్టు పెట్టుకోవటం, రిజర్వేషన్ల ముసుగులో కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే తనను దించేస్తాననే భయం రేవంత్రెడ్డికి పట్టుకున్నదని, ఇది ఆయన మాటల్లో, ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నదని అన్నారు. కేసీఆర్ బస్సు యాత్రలో ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని వెల్లడించారు. సీఎం రేవంత్రెడ్డి సవాల్ చేసినట్టు వెంటనే తన రాజీనామా లేఖను మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డికి అందించాలని, ఆ తర్వాత రెండు నిమిషాల్లో తాను రాజీనామా లేఖ అందజేస్తానని మరోసారి సవాల్ విసిరారు. రాజీనామా లేఖతో తాను గన్పార్ వద్దకు వస్తే, సీఎం తన రాజీనామా లేఖ ఇవ్వకుండా సొల్లు మాటలు చెప్తున్నారని విమర్శించారు. ఉద్యమ సమయంలోనూ రాజీనామా చేయాలని అడిగితే రేవంత్రెడ్డి జిరాక్స్ పేపర్ ఇచ్చి ఆంధ్రా నాయకుల అడుగులకు మడుగులు ఒత్తారని ఆరోపించారు. తాము మాత్రం పదవుల కోసం పాకులాడే వ్యక్తులం కాదని, తెలంగాణ కోసం తాను రెండు సార్లు ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లానని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పినట్టు ఆరు గ్యారెంటీలు, రూ.2 లక్షల రుణమాఫీ, మహిళలకు రూ.2,500, రైతులకు రూ.15 వేల రైతుభరోసాతో పాటు 100 రోజుల్లో అమలు చేస్తామని సోనియాగాంధీతో చెప్పించిన హామీలను ఆగస్టు 15లోపు అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధమేనని మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తేల్చిచెప్పారు. దమ్ముంటే ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అంతేకానీ దేవుళ్ల పేరుమీద ఒట్టు పెట్టి ప్రజలను మోసం చేయడం తగదని చురక అంటించారు. ఇప్పటికైనా బాండ్పేపర్లలో రాసిచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తొలి సంతకం రుణమాఫీపై అని చెప్పి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని అబద్ధపు మాటలు చెప్పిందని హరీశ్ విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా హామీలు అమలు చేయాలని కోరితే.. కోమటిరెడ్డి లాంటోళ్లు కొంతమంది సొల్లు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తే, ఆ ఫ్రస్ట్రేషన్లో తనను తిడుతున్నారని తెలిపారు. తిట్టుడు మాని ఇచ్చిన హామీలు అమలు చేయాలని హితవు పలికారు. ఉద్యమ సమయంలో రాజీనామాలు చేయాలని కోరితే కిషన్రెడ్డి, రేవంత్రెడ్డి తప్పించుకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి జిరాక్స్ పేపర్ ఇస్తే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి రాజీనామా చేయకుండా వెన్ను చూపారని విమర్శించారు. తాము ప్రజల కోసం పదవులను వదులుకుంటే, ఈ నాయకులు ఇద్దరు ఆంధ్రా పాలకుల కోసం పదవులు పట్టుకొని వేలాడారని ధ్వజమెత్తారు. ఇక, జిల్లాలు ఎకువయ్యాయని, కమిషన్ వేసి పార్లమెంట్ స్థానం లెక్కన జిల్లాను చేస్తామని సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని, మెదక్ పార్లమెంట్ పరిధిలోని మూడు జిల్లాలు ఉన్నాయని, మరి ఇందులో ఏ రెండు జిల్లాలను రద్దు చేస్తారని ప్రశ్నించారు. జిల్లాలు రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ మోసపోతామని, ప్రజలు ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తామంటే, జిల్లా ప్రజలు ఊరుకోబోరని, గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్న ఈ తరుణంలో తెలంగాణ కోసం మరోసారి ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నదని హరీశ్రావు తెలిపారు. శనివారం ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గులాబీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఒకడితో మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానం, ఉధృతమై ఉప్పెనగా మారి స్వరాష్ట్ర కలను సాకారం చేసింది. తెలంగాణ జెండా ఎత్తిననాడు కేసీఆర్ వెంట పిడికెడు మంది లేరు. కానీ, ఎత్తిన పిడికిల్లకు మూడున్నర కోట్ల పిడికిల్లను కేసీఆర్ జత చేసిండు. ఎన్నో ఎత్తు పల్లాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అణచివేతలు, ఎన్నో అవమానాలు. 23 ఏండ్ల సుదీర్ఘ ప్రయాణంలో కేసీఆర్ ఎన్నడూ ఎత్తిన జెండాను దించలేదు. పట్టిన పట్టును విడవలేదు. త్యాగాల పునాదుల మీద పుట్టిన పార్టీ ప్రత్యేక రాష్ట్ర సాధన గమ్యాన్ని ముద్దాడి, పదేండ్ల పాలనలో ప్రజలకు అద్భుతమైన ప్రగతి ఫలాలు అందించింది. ఈ ఘనత ముమ్మాటికీ గులాబీ జెండాదే. ఆత్మగౌరవంతో బతికే జాతి తెలంగాణ జాతి. ఆత్మగౌరవం దెబ్బ తిన్నప్పుడల్లా ధికారస్వరమై నిలిచింది. కాంగ్రెస్ పాలనలో రైతులు, అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదు. తెలంగాణకు నష్టం జరిగిన ప్రతిసారి బీఆర్ఎస్ గొంతెత్తి నినదించింది. ప్రజల పక్షాన పోరాటం చేసింది. ఇప్పుడు మరోసారి ప్రజల పక్షాన ప్రజా ఉద్యమం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధమైంది’ అని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్రావు, మాజీ ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు, స్థానిక కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.