టెహ్రాన్: భారత్కు భారీ దౌత్యవిజయం లభించింది. హార్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ (Iran) స్వాధీనం చేసుకున్న వాణిజ్య నౌక నుంచి ఐదుగురు భారతీయులు (Indian Sailors) విడుదలయ్యారు. గత నెల 13న ఇజ్రాయెల్తో (Israel) ఉద్రిక్తతల వేళ.. ఆ దేశానికి చెందిన కుబేరుడు ఇయాల్ ఒఫర్ ‘జోడియాక్’ సంస్థకు చెందిన ఎంఎస్సీ ఏరిస్ (MSC Aries) వాణిజ్య నౌకను హార్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ కమాండోలు స్వాధీనం చేసుకున్నారు. దానిని ఇరాన్ ప్రాదేశిక జలాల్లోకి తరలించారు. అయితే అందులో ఉన్న మొత్తం 25 మంది సిబ్బందిలో 17 మంది భారతీయులు ఉన్నారు. వారిని విడిపించేందుకు భారత విదేశాంగ శాఖ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తాజాగా 17 మందిలో ఐదుగురిని ఇరాన్ విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో ఎంఎస్సి ఏరీస్లో ఉన్న ఐదుగురు భారతీయ నావికులు విడుదలయ్యారని ఇరాన్లోని ఇండియన్ ఎంబసీ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించింది. వారు ఈరోజు సాయంత్రం ఇరాన్ నుంచి బయలుదేరారని పేర్కొన్నది. బందర్ అబ్బాస్లోని ఎంబసీ, ఇండియన్ కాన్సులేట్తో ఇరాన్ అధికారులు సన్నిహితంగా సమన్వయం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపింది. కాగా, గత నెల 18న టెస్సా జోసెఫ్ (Tessa Joseph) అనే నావికుడు విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే అతడు కేరళలోని త్రిస్సూరుకు క్షేమంగా చేరుకున్నాడు. అతనికి కొచ్చి విమానాశ్రయంలో అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.