మన ఊరు-మన బడి కార్యక్రమంతో సర్కారు బడులకు సరికొత్త రూపు రానున్నదని, కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూరుతాయని మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కౌకుంట్ల గ్రామ పాఠశాలలో అదనపు తరగతి గదులు, బాల బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేసిన అనంతరం అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా వికారాబాద్ జిల్లాలోని మద్గుల్ చిట్టెంపల్లిలోని డీపీఆర్సీ భవనంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని 26వేల పాఠశాలల్లో మూడు విడుతల్లో రూ.7298కోట్ల నిధులతో మహత్తరమైన మన ఊరు-మన బడి కార్యక్రమానికి రాష్ట్ర సర్కార్ శ్రీకారం చుట్టిందన్నారు. ముందుగా విద్యార్థులు అధికంగా ఉన్న పాఠశాలలను తొలి విడుతలో ఎంపిక చేసి మౌలిక వసతులను కల్పించనున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం ఎవరైనా దాతలు ముందుకొచ్చి రూ.కోటి అందజేస్తే ఆ బడికి వారిపేరే పెడుతామని తెలిపారు.
పరిగి, ఫిబ్రవరి 22 : కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ బడులను అభివృద్ధిపరచాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మద్గుల్ చిట్టెంపల్లిలోని డీపీఆర్సీ భవనంలో మన ఊరు-మన బడి కార్యక్రమంపై వికారాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లాలో మొదటి విడుతలో 371 పాఠశాలలు ఎంపిక కాగా, వాటిలో 12 రకాల సదుపాయాల కల్పనకు నిధులు వెచ్చిస్తామని చెప్పారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని మంత్రి సూచించారు. ప్రతి పాఠశాల పేరిట రెండు బ్యాంకు ఖాతాలు తెరిచి అత్యంత పారదర్శకంగా నిధులు ఖర్చు చేయడంతోపాటు అన్ని పనులకు సామాజిక తనిఖీ నిర్వహిస్తారని చెప్పారు.
దాతలు ముందుకు వచ్చి కోటి రూపాయలు అందజేస్తే పాఠశాలకు వారి పేరు పెడుతారని, రూ.2లక్షలు అందజేస్తే ఎస్ఎంసీ కమిటీలో సభ్యులుగా నియామకం జరుగుతుందని మంత్రి తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టనున్నామని పేర్కొన్నారు. నా ఊరు, నా బడి అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలని, ఆవరణల్లో 500 మొక్కలు నాటిన పాఠశాలల్లో ఒకరిని వాటి కోసం నియమించుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. 2019-20 విద్యా సంవత్సరంలో గల విద్యార్థుల సంఖ్య ఆధారంగా మొదటి విడుత పాఠశాలలను ఎంపిక చేసినట్లు తెలిపారు. పాఠశాల ప్రహరీ లోపల జూనియర్ కళాశాలలుంటే ఈ కార్యక్రమం ద్వారా వాటిని అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
వికారాబాద్లో బీసీ స్టడీ సెంటర్ ఏర్పాటుకు బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ కృషి చేశారని మంత్రి అభినందించారు. జూనియర్ కళాశాల భవనంలో బీసీ స్టడీ సెంటర్ నిర్వహణకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతి ఉన్నత పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్కు మంత్రి సూచించారు. మన ఊరు-మన బడిలో గ్రామస్థాయి కమిటీల్లో ఎంపీటీసీలకు ప్రాతినిథ్యం కల్పించేలా నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
ఆరోగ్య తెలంగాణ సాధనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్తో కలిసి ఆశ వర్కర్లకు మంత్రి సబితారెడ్డి స్మార్ట్ఫోన్లు అందజేశారు. రాష్ట్రంలో నిర్వహించిన జ్వర సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ప్రాణాలను ఫణంగా పెట్టి ఆశ వర్కర్లు చేసిన సేవ గొప్పదన్నారు.
చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్ రంజిత్రెడ్డి మాట్లాడుతూ.. మన ఊరు-మన బడి స్ఫూర్తితో తాను ఒక పాఠశాలను ఎంపిక చేసుకొని మోడల్ స్కూల్గా మారుస్తానని తెలిపారు. మన ఊరు-మన బడితో పాఠశాలల స్వరూపం మారుతుందని పేర్కొన్నారు. దీంతో సర్కారు బడులు ఆదర్శంగా మారనున్నాయన్నారు.
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో ముందంజలో ఉంటే రాష్ర్టాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పించడంతోపాటు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన గొప్ప కార్యక్రమమని పేర్కొన్నారు. పాఠశాలల అభివృద్ధికి దాతలను ప్రోత్సహించేలా సమావేశాలు ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు.
ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం గొప్ప మలుపుగా అభివర్ణించారు. ధనవంతులు తమ పిల్లలను ప్లే స్కూల్కు పంపిస్తారని, అంగన్వాడీ కేంద్రాలు సైతం బడుల ప్రాంగణంలోకి మార్చడంతోపాటు ఆంగ్ల మాధ్యమం అమలుతో చక్కటి విద్యాబోధన అందుతుందని చెప్పారు.
పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల బలోపేతానికి మన ఊరు-మన బడి దోహదం చేస్తుందని చెప్పారు. గ్రామాల్లో గ్రామ పెద్దలు, వ్యాపారులు, పూర్వ విద్యార్థులతో సమావేశాలు జరిపి దాతలు విరాళాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం పాఠశాలల అభివృద్ధిలో కీలక మలుపుగా మారుతుందన్నారు.
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి మాట్లాడుతూ.. మొదటి విడుతలో అత్యధిక శాతం విద్యార్థులున్న పాఠశాలలు సైతం కొన్ని ఎంపిక కాలేదని, వాటిని మొదటి విడుతలో చేర్చాల్సిందిగా మంత్రికి సూచించారు. పూర్తిగా శిథిలావస్థలో గల ప్రభుత్వ పాఠశాలలకు మొదటి విడుతలో ఎంపికచేయడం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. మన ఊరు-మన బడిలో సర్పంచ్లను భాగస్వాములను చేయడం ద్వారా తమ పాఠశాలకు ఏ సదుపాయాలు అవసరమనేది గుర్తించి వాటి కల్పనకు అవకాశం కలుగుతుందని చెప్పారు. పాఠశాలల ఆవరణల్లో పెద్దఎత్తున మొక్కలు నాటించాలని, తద్వారా చక్కటి వాతావరణంలో విద్యార్థులు ఆటలు ఆడుకునే అవకాశం ఏర్పడుతుందని అన్నారు.
టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ జి.నాగేందర్గౌడ్ మాట్లాడుతూ.. మన ఊరు-మన బడి కింద మొదట ఎంపికైన పాఠశాలలు గల విద్యార్థులు అదృష్టవంతులని, త్వరలోనే సదుపాయాలకు సంబంధించిన పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఆశించిన దానికంటే అధికంగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేయడం ద్వారా పేద విద్యార్థులు చక్కగా చదువుకుంటున్నారని, మన ఊరు-మన బడితో సర్కారు బడుల రూపురేఖలు మారుతామని పేర్కొన్నారు.
సమన్వయంతో పనిచేయాలి జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే సీఎం కేసీఆర్ కన్న కలలు సాకారమవుతాయన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ మాట్లాడుతూ.. గ్రంథాలయ సంస్థ నిధులతో దౌల్తాబాద్, బొంరాస్పేట్, కొడంగల్లో గ్రంథాలయాల నిర్మాణాలకు, కోట్పల్లి, చౌడాపూర్ల గ్రంథాలయ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తాండూరులో కోటీ30లక్షల రూపాయలతో గ్రంథాలయ భవన నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలిపారు. అవకాశం ఉన్నంతవరకు పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయిస్తామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల, జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారాంభట్, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, ప్రజాప్రతినిధులు, అధికారులున్నారు.
పరిగి, ఫిబ్రవరి 22 : డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్తో జిల్లాలో అభివృద్ధి పనులను చేపడుతామని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. సోమవారం డీపీఆర్సీ భవనంలో డీఎంఎఫ్టీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులపై సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.13.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఐసీడీఎస్ ద్వారా జిల్లాలో 42 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి రూ.12లక్షల చొప్పున మంజూరు చేయనున్నట్లు తెలిపారు. పరిగి, కొడంగల్ నియోజకవర్గాలకు అభివృద్ధి పనులు చేపట్టడానికి రెండు కోట్ల రూపాయల చొప్పున డీఎంఎఫ్టీ నిధులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రీయింబర్స్మెంట్ కింద రూ.56లక్షలు, డబుల్ బెడ్రూమ్లలో విద్యుత్ పనులకు రూ.3.54లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని నవాబుపేట మండలంతోపాటు వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్లలో వెయిటింగ్ రూముల నిర్మాణానికి రూ.50లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు మంజూరై పెండింగ్లో ఉన్న పనులకు రూ.6.83 కోట్ల డీఎంఎఫ్టీ నిధులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కౌకుంట్ల గ్రామంలోని పాఠశాలలో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ప్రారంభం
చేవెళ్ల రూరల్, ఫిబ్రవరి 22 : మన ఊరు-మన బడి కార్యక్రమంతో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని విద్యాశాఖ రాష్ట్ర మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధి కౌకుంట్ల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో మంగళవారం అరబిందో ఫార్మా సంస్థ సహకారంతో రూ.90లక్షలతో నూతనంగా నిర్మించనున్న 4 అదనపు తరగతి గదులు, బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి విద్యా శాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అరబిందో ఫార్మా ఫౌండేషన్ సంస్థ కౌకుంట్ల గ్రామంలో సామాజిక బాధ్యతగా (సీఎస్ఆర్ నిధులతో) పెద్దఎత్తున నిధులు వెచ్చించి నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు రావడం అభినందనీయమని మంత్రి కొనియాడారు. గ్రామంలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి విజ్ఞానాన్ని అందించేలా కృషి చేయడం గొప్ప విషయమని, చుట్టుపక్కల గ్రామాల్లోని యువకులు ఇక్కడి అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ఉపయోగించుకునేలా చూడాలని సూచించారు. కేంద్రం ఆవరణలో మొక్కలు నాటి ఆహ్లాద వాతావరణం పెంపొందించేలా చూడాలని సంఘం సభ్యులకు సూచించారు. కేంద్రంలో కంప్యూటర్, పుస్తకాలు ఏర్పాటు చేయించేలా కృషి చేస్తానని మంత్రి సబితారెడ్డి హామీ ఇచ్చారు. కౌకుంట్ల గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందని.. ఇంద్రారెడ్డిని అందించిన గ్రామంగా రాష్ట్రం అంతా గుర్తిస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా యువత ముందుకు సాగుతూ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విజ్ఞాన కేంద్రంలో ఫర్నిచర్ ఏర్పాటు చేయించేందుకు ఎమ్మెల్యే తన సొంత నిధులు రూ.50వేల నగదు అందజేశారు.
ఈ సందర్భంగా అరబిందో ఫార్మా ఫౌండేషన్ కంపెనీ ప్రతినిధి సదానందరెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పుస్తకాలు అందజేశారు. కౌకుంట్ల గ్రామానికి చెందిన టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి చటారి దశరథ్ వివాహం చేసుకోవడంతో వారి ఇంటికి వెళ్లి మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య నూతన వధూవరులను ఆశీర్వదించారు.
కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్, వికారాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఆర్జేడీ విజయలక్ష్మి, డీఈవో సుశీందర్రావు, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, సర్పంచ్ గాయత్రి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, టీఆర్ఎస్ నాయకుడు నాగార్జునరెడ్డి, ఉప సర్పంచ్ ఇనాయత్, అంబేద్కర్ సంఘం గ్రామ అధ్యక్షుడు రవి, సంఘం సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.