సత్తా చాటిన ప్రభుత్వ బడులు
ప్రైవేట్కు దీటుగా ఫలితాలు నమోదు
రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచిన కామారెడ్డి జిల్లా
18వ స్థానానికి పడిపోయిన నిజామాబాద్ జిల్లా
నిజామాబాద్లో 92.84 శాతం ఉత్తీర్ణత
కామారెడ్డిలో 96.58శాతం
విద్యానగర్/ఇందూరు జూన్ 30: ఎస్సెస్సీ ఫలితాల్లోనూ బాలికలే పై చేయి సాధించారు. గురువారం విడుదల చేసిన ఫలితాల్లో కామారెడ్డి జిల్లా 96.58 శాతంతో రాష్ట్రంలోనే నాల్గో స్థానంలో నిలిచింది. నిజామాబాద్ జిల్లా 92.84 శాతంతో 18వ స్థానంలో నిలిచింది. కామారెడ్డిలో మొత్తం 12,414 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 11,989 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 6,238 మం దికి గాను 5,964 మంది (95.61 శాతం), బాలికలు 6,176 మందికి గాను 6025 మంది ఉత్తీర్ణులయ్యారు.
నిజామాబాద్లో:
నిజామాబాద్లో 22,243 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, బాలురు 91.09శాతం, బాలికలు 94.68 శాతం పాస్ అయ్యారని జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ తెలిపారు.
పదోతరగతి సప్లిమెంటరీ షెడ్యూల్
పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన వారి కి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. విద్యార్థులు ఏడాది నష్టపోవద్దనే ఉద్దేశంతో నెల రోజుల వ్యవధిలో సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 1 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. జూలై 18వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పరీక్షల విభాగం అధికారి నీలం లింగం తెలిపారు.
పదోతరగతి ఫలితాల్లో ప్రైవేట్ హవా..
విద్యానగర్,జూన్ 30 : పదోతరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. జిల్లా కేంద్రానికి చెందిన ఆర్కిడ్స్ పాఠశాలలో సునయనా రెడ్డి, మానస, సంజన, గోత్ర, కిషన్ నాయక్, సాయి అమర్త్య, ఆనంద్ 10/10 జీపీఏ సాధించారు. కార్తీక, సౌమిత్ర, ప్రీతి, వర్ష, రజనీష్ 9.8 జీపీఏ సాధించారు. 9 మంది 9.7 జీపీఏ, ముగ్గురు 9.5 జీపీఏ, ఐదుగురు 9.3 జీపీఏ, నలుగురు 9.2 జీపీఏ, ముగ్గురు 9.0 జీపీఏ సాధించారు. లిటిల్ స్కాలర్స్ పాఠశాల నుంచి హాసిని, సిద్ధార్థ్, నందిని 10/10 జీపీఏ సాధించారు. గురు ఎడ్యుకేషనల్ అకాడమీ నుంచి గోత్రా 10/10 జీపీఏ, మహతి 9.8, కార్తీక 9.8 జీపీఏ సాధించారు. లయోలా హైస్కూల్ నుంచి అక్షయ, హన్సిక, మనీషా, మేఘన, రక్షిత, రాణా మహీన్, శృతి, వైష్ణవి, విదిత్ 10/10 జీపీఏ సాధించారు. 10 మంది 9.8 జీపీఏ, 19 మంది 9.7 జీపీఏ, 92 మంది 9.0 జీపీఏ సాధించారు. 10 జీపీఏ సాధించిన విద్యార్థులను ఆర్కిడ్స్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్ గోవర్ధన్ రెడ్డి, లిటిల్ స్కాలర్స్ పాఠశాల కరస్పాండెంట్ పున్న రాజేశ్, గురు ఎడ్యుకేషనల్ డైరెక్టర్ గురువేందర్ రెడ్డి, లయోలా హైస్కూల్ ప్రిన్సిపాల్ వీబీ చారి అభినందించారు.
ప్రజ్ఞశ్రీ విద్యార్థుల జయకేతనం
బోధన్ రూరల్ , జూన్ 30 : పదో తరగతి ఫలితాల్లో బోధన్ మండలంలోని సాలూర ప్రజ్ఞశ్రీ హైస్కూల్ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి ప్రతిభ కనబర్చారు. 67 మంది విద్యార్థుల్లో 8 మంది 10 జీపీఏ సాధించగా, 8 మంది విద్యార్థులు 9.8 జీపీఏ సాధించారు. పాఠశాలలో మొత్తం 100 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు కరస్పాడెంట్ లతారాజు తెలిపారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం లతా రాజు అభినందించారు.
‘ఇందూర్’ విద్యార్థుల ప్రభంజనం
బోధన్, జూన్ 30: బోధన్ పట్టణం ఆచన్పల్లిలో ఉన్న ఇందూర్ హైస్కూల్ విద్యార్థులు అత్యుత్తమ జీపీఏ గ్రేడ్ పాయింట్లు సాధించి ప్రభంజనం సృష్టించారు. మొత్తం ఎనిమిది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారు. బి.కార్తీక, సీహెచ్.స్నేహ, కె.కృష్ణవంశీ, ఎల్. కృష ్ణప్రసాద్, ఆర్.ఐశ్వర్య, ఎస్.శిరీష, వి.ఓంకార్, వై.గగన కీర్తిక అనే విద్యార్థులు 10 జీపీఏ సాధించి తమ ప్రతిభను చాటారు. సాయి కృష్ణారావు, ప్రేమ్దాస్, రుషికలకు 9.8 జీపీఏ, యోగేశ్, రోహిత్రెడ్డి, శ్రావిక, నీలవేణి, శివశంకర్, అక్షయ కీర్తన, కుజేమానాజ్, నందిత, సంజన, ప్రతీక్షలకు 9.7 జీపీఏ వచ్చాయి. మొత్తం 71 మందికి 9 జీపీఏ లేదా ఆ పైన జీపీఏలు వచ్చాయి. ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తాను చాటి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఇందూర్ పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిశోర్ అభినందించారు. ప్రణాళికాబద్ధమైన శిక్షణ, విద్యార్థుల నిరంతర శ్రమ, అంకితభావంతో కూడిన ఉపాధ్యాయుల కృషి ఫలితంగా తమ పాఠశాల ఈ విజయాలను సాధించిందని ఆయన పేర్కొన్నారు.
ప్రతిభ చాటిన సాయి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు
బోధన్, జూన్ 30: బోధన్ పట్టణంలోని సాయి కాన్సెప్ట్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఎస్సెస్సీ ఫలితాల్లో ప్రతిభ చాటారు. షేక్ ఫైజాన్ అహ్మద్ 10 జీపీఏ సాధించాడు. మరో ఆరుగురు విద్యార్థులకు 9 జీపీఏ అంతకంటే ఎక్కువ జీపీఏలు వచ్చాయి. సాధారణ విద్యార్థులను అద్భుతంగా తీర్చిదిద్దడంలో తమ కృషి ఫలించిందని, ఇందుకు తమ హైస్కూల్ విద్యార్థులు సాధించిన ఫలితాలే నిదర్శనమని కరస్పాండెంట్ పాలెపు సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సెస్సీలో అత్యుత్తమ ఫలితాల సాధనకు కృషిచేసిన ఉపాధ్యాయులకు, తమపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులను ఆయన అభినందించారు.
పదిలో ‘కాకతీయ’ విద్యార్థుల విజయకేతనం
ఇందూరు, జూన్ 30 : పదో తరగతి ఫలితా ల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాకతీయ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 13 మంది విద్యార్థులు 10/10 గ్రేడ్ సాధించినట్లు కాకతీయ విద్యాసంస్థల చైర్పర్సన్ విజయలక్ష్మి తెలిపారు. జియ బి.తక్కర్, ఎంకే సుశీల, డి.అనన్య, ఎస్.శ్రీకృతి, ఆర్వ మజార్, ఉమ్ర మహీన్, కె.స్వాతి, జి.హరీశ్ కుమార్, ఆర్.కార్తీక్, శివప్రతం, ఎ.భానుతేజ, బి.విశ్వజ్ఞ చారి, మిర్జా సిబగతుల్లా బేగ్లు 10/10 జీపీఏ సాధించడంతో జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. 31 మందికి 9.8, 24 మందికి 9.7, 36 మందికి 9.5 గ్రేడ్ పాయింట్లు సాధించి కాకతీయ విద్యార్థులు రికార్డు సృష్టించారని.. అద్భుతమైన విజయానికి కారణమైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అధ్యాపక, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులను అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్ సీహెచ్.రజనీకాంత్, ప్రధానోపాధ్యాయులు ఫరీదుద్దీన్, పీవీ నటరాజ్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.
మాతృశ్రీ హైస్కూల్ హవా..
బోధన్, జూన్ 30: బోధన్ పట్టణంలోని మాతృశ్రీ హైస్కూల్ విద్యార్థులు ఎస్సెస్సీ- 2022 ఫలితాల్లో సత్తా చాటారు. పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులకు పదికి పది గ్రేడ్ పాయింట్లు వచ్చాయి. అవుసుల భావన, కోరుట్ల మనస్వి, రాచర్ల సాహితి, అయేషా ఆదిన్, గాండ్ల సాయినాథ్ 10 జీపీఏ సాధించి తమ ప్రతిభను చాటారు. 12 మంది విద్యార్థులు 9.8 జీపీఏ సాధించారు. మరో 12 మంది విద్యార్థులకు 9.7 జీపీఏ వచ్చింది. మాతృశ్రీ హైస్కూల్లోని మొత్తం విద్యార్థుల్లో 9.0 కన్నా ఎక్కువ జీపీఏ పాయింట్లను 78 మంది సాధించారు. అత్యుత్తమ జీపీఏలు సాధించి మాతృశ్రీ ఖ్యాతిని చాటిచెప్పిన విద్యార్థులను, అత్యుత్తమ ఫలితాల సాధనకు కృషిచేసిన ఉపాధ్యాయులను పాఠశాల కరస్పాండెంట్ సిరిగిరి దిగంబర్రావు అభినందించారు.
నలంద విద్యార్థుల ప్రతిభ
ఇందూరు, జూన్ 30 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నలంద పాఠశాల విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో సత్తా చాటారు. ముగ్గురు విద్యార్థులు 10/10 జీపీఏను సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ తెలిపారు. డి.సిద్ధార్థ్, జి.ఉషశ్రీ, కె.శ్రావణి 10 జీపీఏ సాధించారని, శ్రావ్య, శ్రీహర్ష, విశాలిని, శిరీష, మనస్వి, శ్రీవత్సవ్, సాయికార్తీక్ 9.8 జీపీఏ సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు.
ఎస్సెస్సీ ఫలితాల్లో శ్రీ విజయసాయి హైస్కూల్ విజయదుందుభి
బోధన్ శ్రీ విజయసాయి హైస్కూల్లో 18 మందికి 10 జీపీఏలు
బోధన్, జూన్ 30 : ఎస్సెస్సీ -2022 ఫలితాల్లో బోధన్ పట్టణానికి చెందిన శ్రీ విజయసాయి హైస్కూల్ విద్యార్థులు విజయదుందుభి మోగించారు. జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలను ఈ హైస్కూల్ విద్యార్థులు సాధించారు. మొత్తం 18 మంది విద్యార్థులు పదికి పది గ్రేడ్ పాయింట్లు సాధించి రికార్డును సృష్టించారు.పాఠశాలకు చెందిన శ్రేయా షిండే, ఎన్.సాయి వైష్ణవి, సీహెచ్. శివాజితారెడ్డి, సిద్రా సుఫియా, యజ్ఞశ్రీ, డి.యశస్వి, పి.ఐశ్వర్య, వై.దివ్య చైతన్య, డి.లాస్య, ఎం.అక్షయ, కె.అక్షయ, పి.ప్రణతి, ఎం.సాయిచరణ్, ఎండీ మరూఫ్,ఎండీ ఇబ్రహీం, ఎం.సుమిత్, ఎ.గణేశ్, టి. సంపత్ 10 జీపీఏ సాధించారు. అలాగే 16 మంది విద్యార్థులకు 9.8 జీపీఏ, 22 మందికి 9.7, 22 మందికి 9.5, 22 మందికి 9.3 జీపీఏ, 22 మందికి 9.2 జీపీఏ, 22 మందికి 9.0 జీపీఏ వచ్చింది. ప్రతిభ చాటిన విద్యార్థులను హైస్కూల్ ప్రిన్సిపాల్ ఎస్.కృష్ణమోహన్ అభినందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకానికి తమ విద్యార్థులు ఎస్సెస్సీ పరీక్షలో సాధించిన విజయాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
సత్తా చాటిన ‘అభ్యాస’
ఇందూరు, జూన్ 30 : పది ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని నిజామాబాద్ నగరంలోని వినాయక్నగర్లో గల అభ్యాస పాఠశాల కరస్పాండెంట్ చెన్న శ్రీనివాస్ తెలిపారు. వై.తేజస్విని, మోర శివాని, బి.గణేశ్, బి.యశస్విని, జె.సుదీప్తి, ఎం.సాన్విక గురువారం ప్రకటించిన ఫలితాల్లో 10 జీపీఏ సాధించారన్నారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను పాఠశాలలో సన్మానించారు. తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని.. విద్యార్థులు సాధించే మార్కులే ఇందుకు నిదర్శనమని శ్రీనివాస్ తెలిపారు. క్రీడల్లో కూడా ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు. 100 శాతం ఉత్తీర్ణతతో పాటు 10 జీపీఏ సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అన్నపూర్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.