ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 24 : ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ఐసీడీఎస్ జిల్లా సంక్షేమాధికారి పద్మజ ఆధ్వర్యంలో దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్లకు ఓటు హక్కు వినియోగంపై ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క ఓటుతో ఎంతోమంది జీవితాలు మార్చేందుకు అవకాశమున్నందున ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగ పర్చుకోవాలన్నారు. ముఖ్యంగా వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ఓటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ అనిత, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, సీడీపీవో శాంతిశ్రీ, సూపరింటెండెంట్ క్రాంతికిరణ్, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
షాబాద్ : ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎంపీడీవో వెంకయ్య అన్నారు. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో సిస్టమెటిక్ ఓటర్ ఎడ్యుకేషన్, ఎలక్టోరల్ పార్టిసిపేషన్ కార్యక్రమంలో భాగంగా 2024 పార్లమెంట్ ఎన్నికల గురించి బీడీఎల్ చౌరస్తా వరకు 2కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…మీ భవిష్యత్ మీ ఓటు…మీ ఓటు మీ బాధ్యత అని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఓటింగ్ అవుతుందని, ఓటు వేయకపోతే లెక్కలోకి రావు అనే నానుడి ఇప్పటికే గ్రామాల్లో ఉందన్నారు. కానీ పట్టణ ప్రాంతాల్లో కూడా ఓటింగ్ శాతం పెరిగేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకుందాం… ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకుందామని వివరించారు. కార్యక్రమంలో ఎస్ఐ సంతోష్రెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్ఐ నాగభూషణం, మున్సిపల్ మేనేజర్ అంజన్కుమార్, సీనియర్ అసిస్టెంట్ జయరాజ్, సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, టీఎంసీ అనూష, ఆనంద్, విద్యార్థులు పాల్గొన్నారు.