న్యూఢిల్లీ : విధుల్లో ఉన్న సిబ్బంది మలయాళం మాట్లాడటంపై ఢిల్లీకి చెందిన ప్రముఖ దవాఖాన జీబీ పంత్ యాజమాన్యం నిబంధనలు విధించింది. దాంతో అక్కడ పనిచేసే నర్సులు, ఇతర సిబ్బంది ఆందోళకు దిగారు. తమ మాతృభాషలో మాట్లాడుకోవడానికి అడ్డంకులు సృష్టించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేయడంతో దవాఖాన యాజమాన్యం దిగివచ్చింది. హాస్పిటల్ యాజమాన్యం తీరును కేరళలోని వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఖండించారు.
ఢిల్లీలోని గోవింద్ బల్లాబ్ పంత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యాజమాన్యం అక్కడ పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బందిని మలయాళంలో మాట్లాడకుండా నిషేధించింది. ఈ మేరకు శనివారం ఒక సర్క్యులర్ను విడుదల చేసింది. విధుల్లో ఉన్నప్పుడు హిందీ లేదా ఇంగ్లిష్లోనే మాట్లాడాలని హుకూం జారీ చేసింది. ఇతర భాషలు మాట్లాడేవారిపై తగు చర్యలు ఉంటాయని హెచ్చరించింది. దీనిపై మలయాళం ఉద్యోగులతో పాటు ఇతర సిబ్బంది కూడా ఆందోళన వ్యక్తం చేసి విధులకు డుమ్మాకొట్టారు. దాంతో 24 గంటలలోపు సర్క్యులర్ను ఉపసంహరించుకున్నారు. తమకు తెలియకుండానే సర్క్యులర్ జారీ అయిందని దవాఖాన అధికారులు స్పష్టం చేశారు.
ఈ విషయంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, శశి థరూర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రభుత్వ సంస్థ తన నర్సింగ్ సిబ్బందిని తమ మాతృభాషలో మాట్లాడవద్దని ఆదేశించడం ఆశ్చర్యకరంగా ఉన్నదని సోషల్ మీడియా ద్వారా అన్నారు. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని వారు చెప్పారు.
చరిత్రలో ఈరోజు.. భాగమతి నదిలో రైలు దుర్ఘటనకు 40 ఏండ్లు
టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మమత మేనల్లుడు
ఐరాస నివేదిక : అల్-ఖైదా అధినేత జవహరి బతికే ఉన్నాడు..
లినెథోల్మ్ ద్వీపం : సముద్ర మట్టం పెరగకుండా డెన్మార్క్ సృష్టి
పర్యావరణ హితం : చెట్టుపై ఇల్లు కట్టిన ఐఐటీయన్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..