హైదరాబాద్: సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Accident) నలుగురు మృతిచెందారు. జాతర వెళ్తుండగా ఇద్దరు, మద్యంమత్తులో కారు నడపడంతో మరో ఇరువురు అక్కడికక్కడే మరణించారు. సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం తొగర్రాయి వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మేళ్లచెరువు జాతరకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు.
మరో ఘటనలో మేడ్చల్ జిల్లా పరిధిలోని కొంపల్లి వద్ద అదుపుతప్పిన కారు డివైడర్పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో తొమ్మిది మంది యువకులు ప్రయాణిస్తున్నారని చెప్పారు. డ్రైవర్ మద్దం మత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులు మధ్యప్రదేశ్కు చెందినవారిగా గుర్తించారు. ఈ రెండు ఘటనలపై కేసులు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.