అమలాపురం: ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ (Konaseema) జిల్లా అమలాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి వద్ద లారీని ఆటో ఢీకొట్టింది. దీంతో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో పోలీసులు దవాఖానకు తరలించారు. మృతులను నవీన్(22), జతిన్(26), నల్లి నవీన్(27), అజయ్(18)గా గుర్తించారు.
వారిలో ముగ్గురు మామిడికుదురు మండలం నగరం గ్రామ వాసులుగా, మరొకరు పీ.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వారని చెప్పారు. యానాంలో పుట్టిన రోజు వేడుకలు చేసుకుని పాశర్లపూడికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఆటోను వేగంగా నడపడంతో వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.