హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న జూరాల ప్రియదర్శిని డ్యామ్కు వరద ప్రవాహం ప్రారంభమైంది. రుతు పవనాలు విస్తరించడంతో జూరాల డ్యామ్ పరివాహక ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి. దీంతో జలాశయానికి వరద వస్తున్నది. అలాగే కృష్ణా నదిపై ఎగువనున్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 25,400 క్యూసెక్కుల వరద వస్తోంది. అయితే, జూన్ మొదటి వారంలోనే ఈ స్థాయిలో వరద నీరు రావడం ఇదే తొలిసారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 8.651 టీఎంసీల నీరుంది. ఇదిలా ఉండగా.. రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించగా.. పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల తొలకరి జల్లులు పడడంతో రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు. దుక్కులు దున్ని అవసరమైన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు.