జయశంకర్ భూపాలపల్లి : చలివాగు ప్రాజెక్టు నుండి రైతులకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో గల రూపిరెడ్డిపల్లి-పరకాల జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. చలివాగు ప్రాజెక్టు నుండి వెంటనే రైతులకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు పూర్తయిన ఇప్పటివరకు చలివాగు ప్రాజెక్టుకు సాగునీరు అందించకపోవడంతో రైతులు వరినారు సాగు చేయలేని దుస్థితి నెలకొందన్నారు. వందలాదిమంది రైతులు సాగునీటి కోసం తండ్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ కసాయి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల బాధలు తెలుసుకొని వెంటనే రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై రైతులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించడంతో సుమారు గంటపాటు రాకపోకలు స్తంభించిపోయాయి.