లక్నో : ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి బస్సు, జేసీబీ ఢీకొన్న ఘటనలో 17 మంది మృతి చెందగా.. 24 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కాన్పూర్ సమీపంలోని సచేండి వద్ద యూపీ రోడ్వేస్కు చెందిన శతాబ్ది ఏసీ బస్సు, జేసీబీని ఢీకొట్టింది. ప్రయాణికులతో ఉన్న బస్సు లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ప్రమాదం జరగ్గా.. ఈ సమయంలో బస్సు చాలా వేగంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న వారిని రక్షించి, దవాఖానకు తరలించినట్లు కాన్పూర్ రేంజ్ ఐజీ మోహిత్ అగర్వాల్ తెలిపారు.
ఘటనలో 17 మంది మృతి చెందారని చెప్పారు. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్ర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు పీఎంఆర్ఎఫ్ నుంచి రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్గేషియా ప్రకటించారు. ఘటనా స్థలానికి వెంటనే చేరుకొని.. సాధ్యమైనంత వరకు సహాయం అందించాలని సీనియర్ పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు.