న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. వరుసగా రెండో రోజు లక్షకు దిగువన కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 92,596 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. మరో 1,62,664 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారినపడి మరో 2,219 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,90,89,069కు చేరాయి. ఇందులో 2,75,04,126 మంది కోలుకున్నారు.
వైరస్ బారినపడి ఇప్పటి వరకు 3,53,528 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 12,31,415 క్రియాశీల కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. టీకా డ్రైవ్లో ఇప్పటి వరకు 23,90,58,360 డోసులు వేసినట్లు చెప్పింది. మంగళవారం ఒకే రోజు 19,85,967 దేశవ్యాప్తంగా కరోనా నమూనాలను పరిశీలించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఈ నెల 8వ తేదీ వరకు 37,01,93,563 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.