ఖమ్మం వ్యవసాయం/వేంసూరు/పెనుబల్లి/ అశ్వారావుపేట/దుమ్ముగూడెం/జూలూరుపాడు/పర్ణశాల, మే 7 : గాలిదుమారంతో కూడిన అకాల వర్షం రైతులకు నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన మామిడి కాయలు నేలరాలగా.. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, శనగ, పొగాకు పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. వేంసూరు మండలంలో గాలుల ప్రభావంతో చెట్లపై ఉన్న మామిడి కాయలు రాలిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పెట్టుబడి కూడా రాదేమోనని దిగులు చెందుతున్నారు. పెనుబల్లి మండలంలో మోస్తరు వర్షం కురిసింది. కొన్నిచోట్ల ఆరబెట్టిన ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడ్డారు. టార్పాలిన్లు కప్పి ధాన్యాన్ని కాపాడుకున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఏజెన్సీ మండలమైన దమ్ముగూడెం మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అశ్వారావుపేట మండలంలో సుమారు గంట పాటు కురిసిన వర్షంతో రోడ్లపై నీళ్లు ప్రవహించాయి.
ఉరుములు మెరుపులతోపాటు ఈదురు గాలులు వీచడంతో మామిడి తోటలు, శనగ పంట, పొగాకు పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నదని సాగు రైతులు ఆందోళన చెందుతున్నారు. జూలూరుపాడు మండలం లోని పడమట నర్సాపురం, కాకర్ల, పాపకొల్లు, మాచినేనిపేటతండా, కొమ్ముగూడెం, బేతాళపాడు, కరివారిగూడెం గ్రామాల్లో వర్షం కరిసింది. పర్ణశాలలో ఈదురు గాలులతో వచ్చిన వర్షంతో పలు షాపులు, ఇళ్లపై ఉన్న పైకప్పులు ఎగిరిపోయి పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఖమ్మం జిల్లాలో గాలుల ప్రభావం కొనసాగడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు రూరల్ మండలంలో విద్యుత్ సరఫరా కాలేదు. సాయంత్రం తర్వాత ఉరుములు మెరుపులు తోడు కావడంతో కార్యాలయాల నుంచి, వివిధ పనులు ముగించుకొని ఇంటికి వచ్చే ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అక్కడక్కడా చిరుజల్లులు మొదలుకొని మోస్తరు వర్షం కురిసింది. రాత్రివేళ నగరంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. కాగా.. వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో తీవ్ర ఎండలతో సతమతమైన ప్రజలు ఒక్కసారిగా ఉపశమనం పొందారు.