సత్తుపల్లి, మే 15: ఖమ్మం డీసీఎంఎస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాయల వెంకట శేషగిరిరావు (70) అనారోగ్యంతో హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో బుధవారం కన్నుమూశారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన రాయల వెంకట శేషగిరిరావు 1978లో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1982లో స్వర్గీయ నందమూరి రామారావు పిలుపు మేరకు అప్పట్లో టీడీపీలో చేరారు. 1987లో తల్లాడ మండల తొలి ఎంపీపీగా పనిచేశారు. ఆ తరువాత తల్లాడ మండలం గంగదేవిపాడు సహకార సొసైటీ అధ్యక్షుడిగా మూడుసార్లు పనిచేశారు. 2014 నుంచి 2019 వరకు డీసీసీబీ డైరెక్టర్గా, 2019 నుంచి 2023 వరకు డీసీఎంఎస్ చైర్మన్గా పనిచేశారు. 2018లో అప్పటి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వెంట బీఆర్ఎస్లో చేరారు. పార్టీ బలోపేతానికి అవిరళ కృషిచేశారు. రాయల వెంకట శేషగిరిరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, ఆయన అంత్యక్రియలు గురువారం తల్లాడ మండలంలోని తన స్వగ్రామమైన మిట్టపల్లిలో జరుగుతాయని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. రాయల మృతి పట్ల బీఆర్ఎస్ సహా పలు పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. దశాబ్దాలకాలంగా వారితో తనకున్న రాజకీయ అనుబంధాన్ని, రైతాంగం కోసం, ప్రజల కోసం, పార్టీ కోసం శేషగిరిరావు చేసిన కృషిని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.