న్యూఢిల్లీ : అధిక బరువుతో సతమతమయ్యేవారు పాలు సహా డైరీ ఉత్పత్తులను ఆహారంలో భాగం చేసుకోవాలా లేదా వాటిని దూరం చేయాలా అనే చర్చ ఎంతో కాలంగా సాగుతోంది. పాలల్లో శరీరానికి అవసరమైన క్యాల్షియం, ఫాస్పరస్, బీ, డీ విటమిన్లు, పొటాషియం వంటి ఎన్నో పోషకాలున్నాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రొటీన్ అవసరాలకు పాలను మించింది లేదని సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుత దివాకర్ ఇన్స్టాగ్రాంలో రాసుకొచ్చారు.
మన రోజువారీ ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులు చాలా అవసరమని, డైరీ ఉత్పత్తులతో అలర్జీ వంటి ప్రతికూలతలు ఉంటే మినహా పాలను నిత్యం తీసుకోవాలని ఆమె సూచించారు. మన వంటకాల్లో పాలు, పాల పదార్ధాలు ఎప్పటినుంచో భాగమయ్యాయని చెప్పారు. పెరుగుతో కడుపు శుభ్రం అవుతుందని, పెద్దప్రేవులను మజ్జిగ క్లీన్ చేస్తుందని అన్నారు.
పాలు, పాల పదార్ధాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇవ్వడంతో పాటు వాటిలో శరీరానికి అవసరమైన పలు పోషకాలు, అమినో యాసిడ్స్ ఉంటాయని డాక్టర్ రుజుత దివాకర్ ఇన్స్టా పోస్ట్లో చెప్పుకొచ్చారు. మీకు వ్యక్తిగతంగా పాలు సరిపడకపోతే వాటిని విడిచిపెట్టాలని సూచించారు. అసలు పాలు, పాల పదార్ధాలకు ప్రత్యామ్నాయం లేదని ఎవరైనా నిరభ్యంతరంగా నిత్యం పాలు తీసుకోవచ్చని అన్నారు.