వినాయక్నగర్, మే 6 : జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నిషేధిత మత్తుపదార్థాల రవాణా చేయడంతోపాటు నిల్వ చేయడం, విక్రయాలు చేస్తున్న వారిపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు సోమవారం దాడి చేశాయి. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ సోమిరెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మూడు టీములతో వివిధ ప్రాంతాల్లో దాడులు చేసినట్లు తెలిపారు. దాడుల్లో గొల్లపల్లి యాదగిరిగౌడ్, తాటికొండ నర్సయ్య, గడ రాజేశ్కుమార్, సుప్పని నవీన్కుమార్ గౌడ్, షేక్ హుస్సేన్ ఐదుగురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ. 25 లక్షల విలువ చేసే 2.32 కిలోల ఆల్ఫ్రాజోలంతో పాటు 0.530 గ్రాముల క్లోరల్ హైడ్రేట్ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీరితోపాటు మత్తుపదార్థాల విక్రయాలతో సంబంధం ఉన్న మరో ముగ్గురు చెగ్గారి రాజేందర్ గౌడ్, చేవూరి నాగరాజు గౌడ్, నెమోడి శంకర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించామని, పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్హాసన్రెడ్డి ఆదేశాల మేరకు చంద్రభానునాయక్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు పి.స్వప్న, ఏ.వెంకటేశ్, ఎస్సై నర్సింహాచారి, సిబ్బంది నారాయణరెడ్డి, భోజన్న, రాంబచన్ తదితరులు దాడుల్లో పాల్గొన్నారు.