గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేసి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ అన్ని స్థానాల్లోనూ గెలిచి ఉండేదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. కోరుట్లలో ఐదు సార్లు పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు నర్సింగరావు ఏదో పెద్ద నాయకుడిని అనుకొని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ గాలి వీచిన 2009 ఎన్నికల్లోనూ నర్సింగరావు 17 వేల ఓట్లతో ఓడిపోయారని కల్వకుంట్ల సంజయ్ గుర్తుచేశారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో 70 వేల ఓట్లతో, 2014లో 22 వేల ఓట్లతో, 2018లో 32 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని గుర్తు చేశారు. 2023 ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా రాలేదని విమర్శించారు. కనీసం రెండో స్థానం కూడా రాలేదని, అలాంటి వ్యక్తి ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తారని ప్రశ్నించారు. ఐదుసార్లు పోటీ చేసినా ప్రజలు కనీసం ఆయన్ను గుర్తించలేదని విమర్శించారు. నియోజకవర్గంలో మొన్నటి వరకు ఎలక్షన్ రాజా అని ఆయనకు పేరు ఉందని, ఇప్పుడు అది కలెక్షన్ రాజాగా మారిందన్నారు. నియోజకవర్గంలో రైస్మిల్లర్స్, ఇతరులను బెదిరించి వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. పెద్ద నాయకులను తిడితే గొప్పవారం అవుతామనుకుంటే ప్రజలు ఛీత్కరించుకుంటారని హితవు పలికారు.
రాష్ట్రంలో 60 ఏళ్లలో ఉన్న దరిద్రాన్ని కేసీఆర్ పదేళ్లలోనే తొలగించారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దరిద్రాన్ని మళ్లీ తీసుకొచ్చిందని సంజయ్ కల్వకుంట్ల దుయ్యబట్టారు. కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రెస్ అన్న మాటలను నిజం చేస్తుందన్నారు. ఆరు నెలల్లోనే స్కాంలు బయటకు వస్తున్నాయన్నారు. ఆరు నెలల పాలనలోనే కాంగ్రెస్ సర్కారు అవినీతి పెరిగిపోయిందని, ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలన తీరుతో ప్రజల్లో విసుగు వచ్చి ఛీత్కరించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. తనకు ప్రజా సేవలో రాజకీయం ఒక భాగం మాత్రమేనని, తాను ఎప్పటికీ బీఆర్ఎస్ను వీడిపోయేది లేదని స్పష్టం చేశారు.