Telangana | ‘తెలంగాణ ఉద్యమంలో రేవంత్రెడ్డి పాత్ర ఏమిటో చెప్పాలి?’ అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ప్రశ్నించారు. ఆనాడు తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ఈ రైఫిల్రెడ్డి చరిత్ర తెలంగాణ బిడ్డలందరికీ తెలుసునని స్పష్టం చేశారు. తెలంగాణ చరిత్ర నుంచి కాకతీయులను, నవాబులను ఎవరూ చెరపలేరని అన్నారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణలో గొలుసుకట్టు నేడు చెరువుల ఫలాలు పొందుతున్నామంటే అది కాకతీయుల గొప్పదనం కాక మరెవరిదవుతుందని ప్రశ్నించారు. తెలంగాణను తమదైన స్థాయిలో అభివృద్ధి పరిచిన ఘనత కూడా నవాబులకు ఉందని అన్నారు.
కాకతీయులు, నిజాం నవాబులు తెలంగాణలో చేసిన అభివృద్ధిని, వారి గుర్తులను చెరిపివేయాలని ఆలోచన ఏ ఒక్కరూ చేయలేదని వద్దిరాజు రవిచంద్ర, తాతా మధు అన్నారు. చెరువులను చూసినా, చారిత్రక కట్టడాలను చూసినా కాకతీయులు, నవాబులే గుర్తుకొస్తారని తెలిపారు. కేసీఆర్ అంటే అభివృద్ధి అని స్పష్టం చేశారు. అలాంటి కేసీఆర్ ఆనవాళ్లను చెరపడం ఎవరి తరమూ కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ది చెరగని స్థానమని తేల్చిచెప్పారు. అంతటి కేసీఆర్ను ఏదో చేయాలని సీఎం రైఫిల్రెడ్డి (రేవంత్రెడ్డి) ప్రయత్నాలు చేయడం.. ఆయన అవివేకానికి నిదర్శనమని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో కేసీఆర్ చరిత్ర సుస్థిరంగా ఉంటుందని స్పష్టం చేశారు.