పండుగ పూట సమర్పించే ప్రతి నివేదనలో ఒక పరమార్థం ఉన్నది. బతుకమ్మ ఆట తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచుతారు. ‘పాయసాన్నప్రియా, దధ్యన్నాసక్త హృదయా, ముద్గౌదనాసక్త చిత్తా, హరిద్రాన్నైక రసికా, గుడాన్న ప్రీత మానసా’ అంటూ అమ్మకు ఏదో ఒక రూపంలో అన్నాన్ని నివేదిస్తారు. శరీరం నిలవాలంటే అన్నం కావాలి. అలసట తీరాలంటే ఆహారం తీసుకోవాలి. బతుకమ్మ ఆడి అలసిన పిల్లలకు అమ్మకు నివేదించిన ప్రసాదం పెడతారు. ప్రసాదం అంటే పదిమందితో కలిసి పంచుకునేది. అది బలవర్ధకమైనదై ఉండాలి. బతుకమ్మ నవరాత్రుల్లో సమర్పించే నైవేద్యంలో ఎంతటి బలం ఉందో తెలుసుకుందాం!
బతుకమ్మ మొదటి రోజును ‘పెత్రమాస’ అంటారు. కత్తితో కోసినా.. నోటితో కొరికినా ఆ పూలు ఎంగిలి అయినట్లు భావిస్తారు కాబట్టే.. ఎంగిలిపూల బతుకమ్మ అయింది. స్వర్గస్తులైన పెద్దలకు బియ్యం ఇచ్చుకుంటారు. సాయంకాలం ఎంగిలి పూల బతుకమ్మ ప్రారంభిస్తారు. నువ్వులు, బియ్యపుపిండి, పుట్నాలు ప్రసాదంగా పెడతారు. నువ్వుల్లో ఒమెగా- 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు, కార్బొహైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి. అందుకే నువ్వులను ‘పవర్ హౌజ్’ అనీ పిలుస్తారు. నువ్వుల్లో ఐరన్, జింక్, క్యాల్షియం, థయమిన్, ఇతర మినరల్స్తో పాటు విటమిన్-ఇ కూడా సమృద్ధిగా ఉంటుంది. వాటికి బియ్యపు పిండి పుట్నాలు కలిపి ప్రసాదంగా ఇస్తారు.
అటుకుల బతుకమ్మను ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. చప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారుచేసి అమ్మవారికి సమర్పిస్తారు. పప్పులో పీచు, ప్రొటీన్లు దండిగా ఉంటాయి. పప్పు తినడం వల్ల త్వరగా కడుపునిండిన భావన కలుగుతుంది. వెంటనే ఆకలి కాదు. నెమ్మదిగా జీర్ణం అవుతూ రక్తంలోకి చక్కెర వెంటనే విడుదల కాకుండా చేస్తాయి పప్పు దినుసులు. బెల్లం ఓ పోషకాల గని. కాలేయంలోని విష వ్యర్థాలను బయటికి వెళ్లగొడుతుంది. దగ్గు, జలుబులకు మంచి ఔషధం. పైగా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు, సెలీనియం వంటి పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇక అటుకులు చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. అటుకులు తేలిగ్గా జీర్ణం అవుతాయి. పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు మంచి ఆహారం.
మూడోరోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఆరోజు అమ్మవారికి ముద్దపప్పు, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. పాలలోని ప్రొటీన్ బరువు తగ్గడానికి సాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు పాలు తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది. పాలవల్ల డోపమైన్ స్రావం పెరుగుతుంది. ఇది మన మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. జుట్టును బలోపేతం చేయడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో, గుండె జబ్బులను, డయాబెటిస్ను నివారించడంలో పాలు కీలకపాత్ర పోషిస్తాయి. పప్పు, బెల్లం, పాలు కలిపిన పదార్థాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు.
నాలుగో రోజును నానబియ్యం బతుకమ్మగా పిలుస్తారు. ఆ రోజున నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం సమర్పిస్తారు. నైవేద్యం కోసం మొదట బియ్యాన్ని కడిగి, నానబెట్టి, ఆ తర్వాత ఆరబెట్టి.. మెత్తగా పిండి చేస్తారు. అందులో పాలు, చక్కెర, నెయ్యి వేసి పాలకాయల్లా చిన్నచిన్న ఉండలు చేస్తారు. వీటిని పచ్చిపిండి ముద్దలని పిలుస్తారు. శరదృతువులో వచ్చే అనేక పండుగల్లో పచ్చిపిండి ముద్దలు ప్రత్యేక నివేదనగా సమర్పిస్తారు. కొత్తగా వడ్లు వచ్చే కాలం కాబట్టి, బియ్యానికి కొదువ ఉండదు. పైగా ఇవంటే అమ్మకు ఎంతో ప్రీతి. అందుకే, నానిన బియ్యంతో చేసిన పదార్థాలు నైవేద్యం పెడతారు.
బతుకమ్మను ‘అట్ల బతుకమ్మ’గా వ్యవహరిస్తారు. అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు. బియ్యం, మినుప గుళ్లను బాగా నానబెట్టి రుబ్బుకొని అట్లు పోసుకుంటారు. ఈ నైవేద్యంలో కీలకమైనవి మినుములు. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. ఇన్సులిన్, గ్లూకోజ్లను సమతుల్యం చేసి.. డయాబెటిస్ సమస్య తలెత్తకుండా సహకరిస్తాయి. రక్తహీనత, జీర్ణక్రియ, చర్మ సమస్యలకు మినుములు ఉపయోగకారి. వీటిలోని మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం తలనొప్పిని తగ్గిస్తాయి. ఒంటికి, ఎముకలకు బలాన్ని చేకూర్చడంలో ప్రధాన పాత్రపోషిస్తాయి.
ఆరో రోజును ‘అలిగిన బతుకమ్మ’ అంటారు. ఈరోజు ఆశ్వయుజ పంచమి. బతుకమ్మకు ఎలాంటి
నైవేద్యమూ సమర్పించరు, బతుకమ్మ ఆట కూడా ఆడరు. ఈ రోజు అమ్మవారు ఆకలితో ఉంటారని భక్తులు భావిస్తారు. అలక వీడమంటూ బతుకమ్మను ప్రార్థిస్తారు. ఈ రోజు ఏ నైవేద్యమూ ఉండదు. ఎందుకంటే పూర్వకాలం బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగిందనీ, ఆ కారణంగానే ఆరో రోజన బతుకమ్మను ఆడరనీ మరో కథనం.
ఏడో రోజును ‘వేపకాయ బతుకమ్మ’గా అభివర్ణిస్తారు జానపదులు. ఆ రోజు బియ్యపుపిండిని బాగా వేయించి వేపపండ్లలా తయారుచేసి అమ్మకు సమర్పిస్తారు. బియ్యపుపిండిలో విటమిన్- డి, బి, క్యాల్షియం, ఫినోలిక్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. గుండె ఆరోగ్యానికి బియ్యపు పిండి చాలా మంచిది. నిద్రను ప్రోత్సహించే ఎరోటినిన్ హార్మోన్ను పెంచుతుంది. ఇందులో సోడియం తక్కువగా ఉన్నందువల్ల రక్తపోటు సమస్యలు తక్కువ. వీటిలోని కార్బొహైడ్రేట్స్ శరీరానికి ఇంధనాన్ని అందిస్తాయి.
ఎనిమిదో రోజును ‘వెన్నముద్దల బతుకమ్మ’ అంటారు. ఈ
రోజున నువ్వులు, వెన్న/నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారుచేసి, అమ్మవారికి సమర్పిస్తారు. నువ్వులు, నెయ్యి, బెల్లం కాంబినేషన్ చాలా ఆరోగ్యకరమైంది. ఒంటికి బలాన్ని
చేకూరుస్తుంది.
చివరిరోజు ‘సద్దుల బతుకమ్మ’. ఆశ్వయుజ అష్టమి నాడు నిర్వహించే సద్దుల బతుకమ్మ రోజునే దుర్గాష్టమి జరుపుకొంటారు. చివరిరోజున అమ్మవారి కోసం ఐదురకాల నైవేద్యాలు తయారుచేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం.. వీటితోపాటుగా మక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, పునాసదోస, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు. ఐదు రకాల దినుసులతో చేసే నైవేద్యాన్ని సత్తుపిండి అంటారు. రొట్టె, బెల్లం /చక్కెర కలిపి తయారు చేసిన మలీదను అందరికీ పంచితే శుభం జరుగుతుందని విశ్వాసం.