Musi River | 60 ఏండ్ల పాపాలు..ఐదేండ్లలో పోతాయా ? మూసీ పరిరక్షణ, పునరుద్ధరణకు ప్రభుత్వం ఓ వైపు పక్కా ప్రణాళికతో పకడ్బందీ చర్యలు తీసుకుంటుంటే ఓర్వలేని రాతలు..దుర్గంధం అంటూ విషం. పాఠకుల దృష్టి మరల్చేందుకు పన్నాగం. ఉమ్మడి రాష్ట్రంలో మూసీ ప్రక్షాళన పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తే మురిసిందట. ఐదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.80 కోట్ల నిధులు దుర్వినియోగమై పరివాహకంలో దుర్గంధం వ్యాపిస్తుందట. గుజరాత్లోని సబర్మతి నదిలా మూసీని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రోడ్మ్యాప్ రూపొందించి, ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుంది. ప్రధానంగా కాళేశ్వర జలాలతో మూసీ సుందరీకరణ ప్రారంభించింది. ఇవన్నీ పట్టించుకోకుండా మూసీపై ఈనాడు ( eenadu ) అక్కసు వెళ్లగక్కింది. ‘నది పరిరక్షణా…నిధులు భక్షణా’ అంటూ తన అవగాహనలేమిని బయటపెట్టుకుంది.
సబర్మతి రివర్ఫ్రంట్ పనులు పట్టాలెక్కేందుకే ఐదు దశాబ్దాలకుపైగా సమయం పట్టిందనే ధ్యాస లేకుండా…సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఐదేండ్లయినా మూసీ ఇంకా బాగుపడలేదంటూ మొసలికన్నీరు కారుస్తున్నది. అంతెందుకు కేవలం ఎకరంన్నర భూమి కోసం ఔటర్రింగు రోడ్డు నిర్మాణ సమయంలో ‘ ఈనాడు ( eenadu ) ’ చేసిన అక్షర యాగీలో కనీసం ఐదోవంతు మూసీ బాగు కోసం లిఖించినా ప్రజలకు ఎంతో మేలు జరిగేది.
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ను కేవలం వాణిజ్య వస్తువుగా భావించిన అప్పటి పాలకులు చారిత్రక మూసీని గాలికొదిలేశారు. 2007లో గ్రేటర్ హైదరాబాద్ ఆవిర్భవించినప్పటికీ 2014 వరకు నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థే దిక్కు. ఆవాసాల నుంచి వచ్చే మురుగునీటిని శుద్ధి చేయకుండా మూసీలోకి వదలడంతోపాటు దశాబ్దాలపాటు కబ్జా, పారిశ్రామిక వ్యర్థాల పారబోతకు కేంద్రమైన మూసీ పరివాహకాన్ని ఏనాడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. గత కొన్నేండ్లుగా మంచి వర్షాలతో మూసీ జలాలను నగరవాసులు చూస్తున్నామేగానీ… ఎగువన పరివాహకంలోని ఆక్రమణలు, అడ్డుగా నిర్మించిన చెక్డ్యాంలతో ఏండ్ల తరబడి నదీ మార్గంలో మురుగు తప్ప వరద పారలేదు.
‘ ఈనాడు ( eenadu ) ’ తన కథనంలో ఆరు దశాబ్దాలుగా జరుగుతున్న విషయాన్నే చెప్పింది. పలుచోట్ల వ్యర్థాలు పారబోస్తున్నట్లుగా రాసింది. నిజానికి మూసీ సుందరీకరణకు ప్రభుత్వం తలపెట్టిన బృహత్తర ప్రాజెక్టు ఇంకా పూర్తికాలేదు. ఇప్పటికీ ఆరంభదశలోనే ఉంది. కొన్నిచోట్ల వ్యర్థాలను పారబోసినంత మాత్రాన వెచ్చించిన నిధులు భక్షణకే అన్నట్లు కట్టుకథలు అల్లడం విజ్ఞులైన పాఠకులను గందరగోళంలోకి నెట్టడమే.
ఏడాదంతా మూసీలో గోదావరిజలాలు ప్రవహించి, చెత్తాచెదారం పేరుకోకుండా,దుర్గంధం వ్యాపించకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే డిజైన్ రూపొందించారు. కొండ పోచమ్మసాగర్ నుంచి 700 క్యూసెక్కుల జలాల్ని జంట జలాశయాలకు తరలించి, అక్కడినుంచి మూసీలో అవసరమైనపుడు ప్రవాహం ఉండేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఈ విషయాన్ని శాసనమండలిలో పురపాలకమంత్రి కేటీఆర్ వెల్లడించారు. మూసీ సుందరీకరణ ప్రారంభ దశలోనే ఉంది. సబర్మతి తరహాలో మారేందుకు కొంత సమయం పడుతుంది. కానీ ఈ వాస్తవాల్ని తెలిసినప్పటికీ ‘ ఈనాడు ’ మాత్రం సీఎం ప్రకటన చేసి ఐదేండ్లయిందంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే కుయక్తులు పన్నుతున్నది.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
నాడు కంపు.. నేడు ఇంపు : మూసీ అందం చూశారా
నాగోల్ బ్రిడ్జికి పచ్చలహారం
Musi River | మూసీపై ఈనాడు ( eenadu ) నానాయాగి.. సుందరీకరణపై విషపు రాతలు