కామారెడ్డి/బీబీపేట్/దోమకొండ/కోటగిరి , మే 8: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచే ఉక్కపోతగా ఉన్న వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. కామారెడ్డి జిల్లాలోని బీబీపేట, దోమకొండ, నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండలాల్లో ఈదురుగాలుల ధాటికి నష్టం సంభవించింది. దోమకొండ మండల కేంద్రంలోని శివరాం మందిర్ ఆలయంలో రథాలను ఉంచే స్థలంలో పైకప్పు రేకులు కిందపడ్డాయి. పొతంగల్ చెక్పోస్టు వద్ద ఉన్న ఓ భవనం అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో రూ.5లక్షల మేర నష్టం వాటిల్లినట్లు యజమాని నాగయ్య తెలిపారు. పలుచోట్ల చెట్లు నేలకూలాయి. వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో చిరుజల్లులు కురిశాయి. దీంతో ఆకాశంలో ఏర్పడిన ఇంద్ర ధనస్సు చూపరులను ఆకట్టుకున్నది.