దేశీయ స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. మదుపరులు పెట్టుబడులు, అమ్మకాల ఒత్తిడి నడుమ కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో సూచీలకు ఒడిదొడుకులు తప్పట్లేదు. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో పోల్చితే.. నష్టాలకే పరిమితమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 273.17 పాయింట్లు లేదా 0.32 శాతం పడిపోయి 83,938.71 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 73.05 పాయింట్లు లేదా 0.28 శాతం దిగజారి 25,722.10 దగ్గర నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా మదుపరులు లాభాల స్వీకరణకే పెద్దపీట వేస్తారన్న అంచనాలున్నాయి. అయినప్పటికీ అక్టోబర్ నెలకుగాను దేశీయ వాహన అమ్మకాలు, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) గణాంకాలు ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహం తీసుకొస్తే కొనుగోళ్లకు ఆసక్తి కనబర్చవచ్చు.
కాబట్టి ఆటో, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు ట్రేడింగ్ను ప్రభావితం చేస్తాయన్న అభిప్రాయాలైతే మెజారిటీ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇక ఎప్పట్లాగే గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, ముడి చమురు ధరలు, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ, ఇతర అంతర్జాతీయ పరిణామాలు ముఖ్యమే. కాగా, అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 25,500 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 25,300 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 25,900-26,200 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.