కామారెడ్డి, ఏప్రిల్ 18 : ఉమ్మడి జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి. మండే సూర్యుడికి జనం అల్లాడుతున్నారు. ఇంటా, బయట ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎన్ని ఫ్యాన్లు, ఏసీలు ఉన్నా శరీరంలో వేడిగానే ఉంటున్నది. ఉదయం 7 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. మధ్యాహ్నం 12 దాటిందంటే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సుమారు 42 డిగ్రీల పైనే ఉష్ణోగ్రత నమోదవుతున్నది. కామారెడ్డి జిల్లా ఏరియా దవాఖానలో ప్రతిరోజూ తలనొప్పి, విరేచనాల సమస్యలతో 10 నుంచి 15 మంది వరకు చికిత్స కోసం వస్తున్నారు. సాధ్యమైనంత వరకు 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
వేసవిలో ముఖ్యంగా శరీరంలో ప్లూయిడ్ లెవల్స్ పడిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఫ్లూయిడ్ లెవల్స్ తగ్గితే శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. ఎక్కువ మోతాదులో నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. గంటకు 2,3 గ్లాసుల నీరు తీసుకోవాలి. పుచ్చకాయ రసం, బార్లీ జావలో పటికబెల్లం, కొబ్బరి నీళ్లు తాగాలి. మజ్జిగ, నిమ్మరసం, చెరుకు రసం, తేలికగా జీర్ణం అయ్యే పదార్థాలను తీసుకోవాలి. అలాగే ఆల్కహాల్, కాఫీ వంటి పానీయాలకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా పిల్లల విషయంలో తప్పనిసరి జాగ్రత్తలు
పాటించాలి.
ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలకు 2,3 గ్లాసుల నీళ్లు, పెద్దవారు రోజుకు 5 లీటర్ల నీళ్లు తాగాలి. వడదెబ్బ తగిలితే వెంటనే దవాఖానలో చేర్పించి ప్రథమ చికిత్స చేయించాలి. ఉప్పు కలిపిన నీరు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, పుచ్చకాయ రసం, మజ్జిగను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.