ఎన్నికల యుద్ధ సందర్భంలో ‘కుమ్మక్కు’, ‘బీ టీం’ అంటూ యథేచ్ఛగా పేలుతున్నయి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రెండు జాతీయ పార్టీలు. ఈ రెండు పార్టీల టార్గెట్ బీఆర్ఎస్సే. వాటిని ఆ స్థాయిలో హడలెత్తిస్తున్నరు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆయన సభలకు వస్తున్న భారీ స్పందన ఆ రెండింటికి నిదురను దూరం చేస్తున్నది. అందుకే, ఆ రెండు పార్టీలు కలిసి నాటకాలు ఆడుతున్నయి. వాటి సంయుక్త దర్శకత్వంలో నాటకాన్ని రక్తి కట్టిస్తున్నది ఎన్నికల కమిషన్. కాబట్టే, ‘పేగులు మెడలో వేసుకుంటా, డ్రాయర్ లాగేస్తా, కనుగుడ్లు పీకేస్తా’ వంటి వల్గర్, ఛీప్ భాష మాట్లాడిన రేవంత్రెడ్డిని వదిలేసి.. కాంగ్రెస్ అబద్ధపు హామీలను, విధానపరమైన నిర్ణయాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లిన కేసీఆర్పై 48 గంటల నిషేధం విధించిన ‘భారత జాతీయ కాంగ్రెస్ జనతా ఎన్నికల కమిషన్’ చెప్తున్నది ఎవరు ఎవరితో కుమ్మక్కు అవుతున్నరో అని.
Congress-BJP | ‘మేం బీజేపీలో చేరము. కానీ, బయటి నుంచి మద్దతు ఇస్తం’ అన్న రీతిలో ఎన్నికల కమిషన్, ఈడీ, ఐటీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నయి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు సృష్టించే విషయంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయనడానికి వంద ఉదాహరణలు చెప్పవచ్చు. ఒకటే మద్యం కేసులో కేజ్రీవాల్పై ఒక రకంగా, శరత్ చంద్రారెడ్డిపై ఒక రకంగా, కల్వకుంట్ల కవితపై ఒకరకంగా వ్యవహరిస్తున్నయి రెండు జాతీయ పార్టీలు. తెలంగాణలో ఎన్నో మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలతో బీఆర్ఎస్ను దించి కాంగ్రెస్-బీజేపీ కలిసి గద్దెనెక్కుతున్నయి.
‘మోదీ గారు’ అధీర్ బాబు అని పిలిచే కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధురి బెంగాల్లో తమ మిత్రపక్షమైన టీఎంసీకి కాకుండా బీజేపీకి ఓట్లేయాలని చెప్పడం కుమ్మక్కుకు పరాకాష్ఠ. కేరళలో తమ మిత్రపక్ష సీఎం పినరయి విజయన్ను రేవంత్రెడ్డి తిట్టి రావడం ఈ కుమ్మక్కులో భాగమే. సిగ్గూ ఎగ్గూ లేని తెలంగాణ వామపక్ష నాయకులు కిమ్మనలేకపోవడం అతి అధమస్థాయి కుమ్మక్కు. ఏ మాత్రం విలువలు లేని రాజకీయం!
నరేంద్ర మోదీకి తాను చోటే భాయ్ అని రేవంత్రెడ్డి తెలివి తక్కువగా ఏమీ చెప్పలేదు. బాహాటంగానే మోదీతో, అదానీతో అంటకాగారు. ‘నేను ఏబీవీపీ మనిషిని. మీకు నమ్మదగినవాడిని. తెలంగాణలో మీ అవసరాలు నేను, నా అవసరాలు మీరు తీర్చడంపై సీరియస్గా ఉందాం’ అని ఆయన మోదీతో, ఆర్ఎస్ఎస్ పెద్దలతో చెప్పి ఉంటారని అనడానికి మనకెవరికీ సాక్ష్యాధారాలు అవసరం లేదు. రేవంత్ ప్రతి మాటా, ప్రతి చేతా అదే స్పష్టం చేస్తున్నది. బీజేపీ గెలుపు కోసం కనీసం ఆరేడు స్థానాల్లో బలహీనమైన అభ్యర్థులను నిలిపారు రేవంత్రెడ్డి.
రాహుల్గాంధీని, తెలంగాణ కాంగ్రెస్నూ పీకల్లోతు పాతిపెట్టడానికి స్కెచ్ వేశారు రేవంత్. తెలివి తక్కువ కాంగ్రెస్ అధిష్ఠానానికి ఇవేవీ పట్టవు. మెప్పించే మాటలు, మురిపించే మూటలు చాలు వారికి. పాపం, పార్టీ జెండాయే జీవితం అనుకునే నాన్ సీరియస్ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల ఊహలకు కూడా అందరు రేవంత్.
తెలంగాణ బీజేపీ పరిస్థితి కూడా అచ్చం కాంగ్రెస్లాగే ఉన్నది. ‘బండి సంజయ్, కిషన్రెడ్డి లాంటి వాళ్లను మా అధిష్ఠానం పట్టించుకోదు. టాప్ ముగ్గురు, నలుగురు జాతీయ నాయకులే అన్నీ స్వయంగా చూస్తరు, చేస్తరు. కిషన్రెడ్డి, బండి సంజయ్లకు ముఖ్య విషయాలు ఏమీ చెప్పరు’ అని బీఎల్ సంతోష్ తరఫు మనుషులు మొయినాబాద్ ఫామ్హౌజ్లో చెప్పిన విషయం మనందరం ఆడియోల్లో విన్నం.
కాంగ్రెస్, బీజేపీలపై సాధికారికంగా, గణాంక సహితంగా చెలరేగిపోయే బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ను నిర్బంధించిన్రు. నిషేధాలు, నిర్బంధాలు ఉద్యమకారులకు నిజమైన అభినందనల లాంటివి. వారి పనితీరును గౌరవించటం వంటివి. బూడిద నుంచి భగ్గుమని లేచి ఆకాశానికి ఎగిరే ఫీనిక్స్ పక్షిలా లేస్తరు నాయకులు. కేసీఆర్ చెప్పినట్టు 48 గంటల నిర్బంధానికి ప్రతీకారం 96 గంటల నిరసనల రూపంలో చూపిస్తరు ప్రజలు.
కేసీఆర్కు పొత్తూ, కుమ్మక్కూ లాంటివి ఉంటే గింటే అవి ప్రజలతోనే. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల జీవనప్రమాణాల పెంపు గురించి ఆలోచించే నాయకునికి, ఆయన పార్టీకి చిల్లర రాజకీయాలు అవసరం లేదు.
రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్కు, బీజేపీకి మరొక సామీప్యం కూడా ఉన్నది. దేవుని పేరుతో ఓట్లు అడగటం బీజేపీ నీచ రాజకీయం అయితే, దేవునిపైనే ఒట్లు వేయడం రేవంత్ చిల్లర రాజకీయం. అయితే ఇవన్నీ చైతన్యవంతమైన తెలంగాణ సమాజం ముందు నడవవు. తన బూటకపు ఒట్ల వల్ల కీడు కలుగకూడదనే రేవంత్ తన కుటుంబంపై ఒట్లు వేయడం లేదని, దేవుడు తేరగా దొరికిండు కదాని ఆయనపై ఒట్లు వేస్తున్నరని ఊర్లల్లో సామాన్య జనం మాట్లాడుకుంటున్నరు. దేవునిపై ఆ రెండు పార్టీలకు ఉన్న దైవ భక్తి, పాప భీతి ఏపాటిదో అర్థం అవుతున్నది కదా? మాధవునితోనే నాటకాలు ఆడేవారికి మానవులు ఒక లెక్కా?
అంతిమంగా చెప్పదలచుకున్నది ఒక్కటే: ‘మోదీ, రేవంత్ కుమ్మక్కుల గురించి ఆలోచించండి, మీ భవిష్యత్తు పట్ల జాగరూకులై ఉండండి’ అని తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు కూడా నేను సూచిస్తున్నా.
ఇక, విజ్ఞులైన తెలంగాణ జనానికి: తెలంగాణలో బీఆర్ఎస్ మొదటి స్థానంలోకి వేగంగా దూసుకువస్తున్నదని, కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితం కానున్నదని జాతీయ సర్వేలు సైతం చెప్తున్నయి. 8-10 స్థానాల వరకు బీఆర్ఎస్ గెలువబోతున్నది. పదేండ్ల ప్రగతి తెలంగాణను ఐదు నెలల్లోనే సర్వనాశనం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల గ్రామగ్రామాన నిరసనలు వెల్లువెత్తుతున్నవి. ఆ పార్టీ అభ్యర్థులను ప్రజలు నిలదీస్తున్నరు. హామీలు, గ్యారెంటీలు అన్నీ మోసమని గ్రహించిన్రు. బీఆర్ఎస్ సభలకు పోటెత్తుతున్నరు. అందుకే ఆ రెండు పార్టీలకు దడ పుట్టి నీచ రాజకీయాలకు తెరలేపుతున్నయి. ఈ తరుణంలో బీఆర్ఎస్ను, తెలంగాణను దెబ్బతీసే కుమ్మక్కు ఎత్తుగడలపై తస్మాత్ జాగ్రత్త.
– శ్రీశైల్ రెడ్డి పంజుగుల 90309 97371