KTR | హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): భారత ఎన్నికల సంఘం బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్షాలు మత వైషమ్యాలు రెచ్చగొట్టేవిధంగా మాట్లాడినా, సీఎం రేవంత్రెడ్డి ఇష్టారీతిన మాట్లాడినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని దుయ్యబట్టారు. మోదీపై చర్యలు తీసుకునే దమ్ము, ధైర్యం ఎన్నికల సంఘానికి లేదని, కనీసం నోటీసులు ఇవ్వడానికి కూడా జంకుతున్నదని విమర్శించారు.
రేవంత్రెడ్డితోపాటు కాంగ్రెస్, బీజేపీ నాయకులపై తాము ఇప్పటివరకు 27 ఫిర్యాదులు చేశామని, ఒక్కదాన మీద కూడా చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. కేసీఆర్ రోడ్షోలకు వస్తున్న ప్రజాదరణను చూసి కాంగ్రెస్, బీజేపీలకు దడ పుట్టిందని ఎద్దేవా చేశారు. ప్రజా స్పందనను చూసి ఓర్వలేక కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం విధించారని మండిపడ్డారు. గురువారం తెలంగాణభవన్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం తీరును తూర్పారబట్టారు.
మోదీ, అమిత్షా మత వైషమ్యాలు రెచ్చగొట్టేవిధంగా మాట్లాడినా, దారుణమైన వ్యాఖ్యలు చేసినా, ప్రత్యర్థి పార్టీలను బండబూతులు తిడుతున్నా, బీజేపీ ట్విట్టర్ ఖాతాలో ముస్లింలపై డైరెక్ట్గా విషం చిమ్ముతూ పోస్ట్లు చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ముస్లింలే ఎకువమంది పిల్లలను కంటారని, ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులను పంచేస్తారంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దాదాపు 20 వేల ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై కనీసం మోదీకి ఈసీ నోటీసులు కూడా ఇవ్వలేదని చెప్పారు. బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో రాముడి ఫొటో పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారంటూ ఆధారాలను చూపించారు.
బీజేపీ అభ్యర్థి అరుణ్గోగుల్ రాముడి ఫొటోతో ఎన్నికల ప్రచారం చేస్తున్నా, మోదీ విద్వేష వ్యాఖ్యలు చేసినా, అమిత్షా దేవుని ఫొటోలు పెట్టుకొని ఓట్లు అడిగినా ఎన్నికల కమిషన్లో ఉలుకు-పలుకు ఉండదని విమర్శించారు. కానీ, కేసీఆర్ విషయంలో మాత్రం ఆగమేఘాల మీద నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. సిరిసిల్లలో ఎండిన పంటలు, రైతుల ఆర్తనాదాలు విన్న తరువాత, సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యలను చూసి నిరోధ్లు, పాపాడాలు అమ్ముకోవాలని ఒక దుర్మార్గుడు అంటే, దానిని ఖండిస్తూ కేసీఆర్ కొంచెం కఠిన పదాలు వాడారని వివరించారు.
4 కోట్ల ప్రజల తరుఫున మాట్లాడుతున్న కేసీఆర్ గొంతు నొక్కి, 48 గంటలపాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధంవిధించిన ఈసీకి రేవంత్రెడ్డి మాటలు నీతిసూక్తులు, ప్రవచనాలు, సుభాషితాల్లాగా కనిపిస్తున్నాయా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ తలనరకండని అంటూ రేవంత్ మాట్లాడారని ఆక్షేపించారు. బీఆర్ఎస్ ఫిర్యాదులపై ఈసీ చర్యలు తీసుకోలేదని, మంత్రి సురేఖను మందలించి సరిపెట్టిందని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రలకు ఓటు ద్వారానే జవాబు చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ అయితే మోదీ, రేవంత్రెడ్డిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నదని కేటీఆర్ నిలదీశారు. కేసీఆర్ గొంతును 48 గంటలు నిషేధించవచ్చని, కానీ కేసీఆర్ తయారుచేసిన కార్యకర్తలను గ్రామ గ్రామాన అడ్డుకోలేరని స్పష్టంచేశారు. కాంగ్రెస్, బీజేపీలు వేరువేరు కాదని, ఆ రెండూ ఒక్కటిగానే భావిస్తున్నామని మీడియా అ డిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. సమావేశంలో కో రుట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్, మాజీ మంత్రి పొ న్నాల, మాజీ ఎంపీ రావుల, మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.