అదేదో తెలుగు సినిమా డైలాగ్లాగా ‘నాకు నేనే పోటీ, నాతో నేనే పోటీ, నాకు ఎవరు ఎదురొచ్చినా తొక్కిపడేస్తా’ అనే విధంగా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారు. అధికారాన్ని దక్కించుకోవడం కోసం, దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆయన ఎంత దూరమైనా వెళ్తారనడంలో సందేహం లేదు. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి మొన్నటివరకు మతాల మధ్య వైషమ్యాలు పెట్టడానికి కూడా ఆయన వెనుకాడేవారు కాదు. అదీ కుదరకపోతే ప్రతిపక్ష పార్టీల నేతలను ఈడీ ద్వారా జైల్లో పెట్టించేవారు. కానీ, ఇప్పుడు కుర్చీ కోసం ఏకంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులనే మింగేస్తున్నారు! మొన్న ఖజురహో, నిన్న సూరత్, నేడు ఇండోర్. మరి రేపు మరొకరు మోదీ అధికార దాహానికి బలి కావాల్సిందేనా?
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గొప్పలు చెప్పుకొనే మన దేశంలో అసలు ప్రతిపక్షం అనేది ఉండకూడదా? ఒకవేళ మోదీ మరోసారి అధికారం చేపడితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు నిజంగానే దేశంలో ఇవే చివరి ఎన్నికలు కానున్నాయా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తున్నది. ఇప్పటినుంచే అందు కనుగుణంగా పరిణామాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్నో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి.
సూరత్లో రాజకీయ నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభాని నామినేషన్ను తిరస్కరించడం వివాదాస్పదంగా మారింది. నీలేష్ కుంభాని నామినేషన్ తిరస్కరణకు గురికావడం, ఇతర ఇండిపెండెంట్లు బరిలో నుంచి తప్పుకోవడంతో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆ నియోజకవర్గంలోని దాదాపు 18 లక్షల మంది ఓటర్లకు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకుండాపోయింది. ఏడు దశాబ్దాల సూరత్ లోక్సభ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. సూరత్లో మొత్తం 15 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో నీలేశ్ కుంభాని సహా 6 నామినేషన్లను తిరస్కరించారు. అనంతరం 8 మంది స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇదంతా బీజేపీ ప్రోద్బలంతోనే జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. నామినేషన్లను ఉపసంహరించుకోవాలని స్వతంత్ర అభ్యర్థులను కోరినట్టు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే చెప్పడం చూస్తే బీజేపీ నిర్వాకమని తెలుస్తున్నది.
కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా చేసిన సంతకాలు నకిలీవని చెప్తున్నప్పటికీ అది అనుమానాస్పదంగా మారింది. నీలేశ్ కుంభాని మద్దతుదారులుగా సంతకాలు పెట్టినవారంతా ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులే. సంతకం పెట్టినవారిలో జగదీశ్.. నీలేశ్కు బావ వరుస అవుతారు. ధ్రువిన్ మేనల్లుడు. రమేశ్ పోల్రా ఆయన బిజినెస్ పార్ట్నర్. ఆ ముగ్గురు నీలేశ్కు ఆప్తులే అయినప్పటికీ వారు కలెక్టరేట్కు వెళ్లి నామినేషన్లపై ఉన్నవి తమ సంతకాలు కావని ఎందుకు ప్రమాణపత్రం ఇచ్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాజాగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బమ్ తన నామినేషన్ను ఉపసంహరించుకొని బీజేపీలో చేరడం సంచలనంగా మారింది. అక్షయ్ కాంతి బమ్ నామినేషన్ను ఉపసంహరించుకోవడానికి సరిగ్గా మూడు రోజుల ముందు నాటకీయ పరిణామాలు జరిగాయి. 17 ఏండ్ల కిందటి కేసులో కోర్టుకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు అందాయి. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. దీంతో ఇదంతా కాకతాళీయంగా జరిగిందా? లేదా ఏదైనా రాజకీయ కుట్ర దాగి ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇండోర్లో 1989 నుంచి బీజేపీ అభ్యర్థులే ఎంపీలుగా గెలుస్తున్నారు. 1989-2014 వరకు సుమిత్రా మహాజన్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించగా.. 2019లో శంకర్ లల్వానీ ఐదు లక్షల మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించారు. అంత భారీ మెజారిటీ వచ్చిన స్థానంలో ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థి నామినేషన్ను విత్డ్రా చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది. ఓటమి భయంతోనే బీజేపీ ఇలా చేస్తున్నదనేది స్పష్టంగా తెలుస్తున్నది. ఓటమి భయంతోనే అనేక చోట్ల బీజేపీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నదనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఖజురహోలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి మీరా యాదవ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో చేసేదేమీ లేక ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థి కేవీ ప్రజాపతికి ఇండియా కూటమి మద్దతు ప్రకటించింది.
ఎవరు పోటీలో ఉండాలో ఎవరు ఉండకూడదో బీజేపీ నిర్ణయిస్తుండటం ఆందోళనకరం. ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. పోటీ ఉండకూడదని అనుకున్నపుడు ఎన్నికలు నిర్వహించడం ఎందుకు? కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేయడమెందుకు?
ఓటు ద్వారానే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది. అసలు పోటీయే లేకుండా బలవంతపు ఏకగ్రీవాలు దేశానికి మంచిది కాదు. ఒకవేళ మూడోసారి మోదీ సర్కార్ అధికారంలోకి వస్తే.. దేశంలో ఇవే చివరి ఎన్నికలు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓటు అనేది హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ప్రతిఒక్కరూ నడుం బిగించాలి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారికి తమ ఓటుతో సమాధానం చెప్పాలి.
– భరత్ చౌహాన్ 90306 66999