నిజామాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నికల ముందర మభ్యపెట్టి మోసగించిన పార్టీలకు ప్రజలు షాక్ ఇస్తున్నారు. హామీలు ఏమయ్యాయని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఓట్ల కోసం మళ్లీ వస్తున్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మొన్న ఇందల్వాయిలో ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ లోకసభ అభ్యర్థి జీవన్రెడ్డిని జనం నిలదీశారు. పింఛన్లు, రుణమాఫీ సహా మిగతా హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. అలాగే, బీజేపీ పరిస్థితి కూడా ఇంతే ఉంది. గత ఎన్నికల్లో పసుపుబోర్డు పేరిట వంచించిన ఎంపీ, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్పైనా రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
దానికి తోడు వివాదాస్పద వ్యాఖ్యలతో, అహంకారపూరిత వైఖరితో వ్యవహరిస్తున్న అర్వింద్పై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతున్నది. మొన్న మెండోరా మండలంలో ఓ వర్గం వారి విషయంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎంపీని అడ్డుకున్నారు. ఇక, జర్నలిస్టులతో వ్యవహరించిన తీరుపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా ఎక్కడకు వెళ్లినా బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు పరాభవమే ఎదురవుతున్నది. ఈ మధ్య కాలంలో చోటుచేసుకున్న జాతీయ పార్టీల నిలదీతల పర్వం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది.
ఎంపీగా గెలిచిన నాటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం సోషల్ మీడియాలో కనిపించే అర్వింద్ తీరు మరోసారి చర్చనీయాంశమైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ ఇవేవి పట్టని బీజేపీ ఎంపీ మాత్రం మొన్న మెండోరా మండలంలో ఓ వర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అన్ని చోట్ల తన మాటే చెల్లుబాటు అవుతుందని భావిస్తూ వచ్చిన ఎంపీకి ఓ వర్గం మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
మా మనోభావాలను దెబ్బతీస్తూ వ్యాఖ్యలు చేస్తావా? దేవుడు ఎవకరికైనా ఒకటే కదా? అని మహిళలంతా అర్వింద్ను నిలదీశారు. మరోవైపు, ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరించిన ఎంపీపై చర్యలు తీసుకోకపోవడంపై చర్చ జరుగుతున్నది. జిల్లా ఎన్నికల అధికారి హోదాలో ఉన్న కలెక్టర్, ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన ఐఏఎస్ అధికారులు మాత్రం ఈ వ్యవహారాన్ని పట్టించుకోకపోవడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై కనీసం ఎంపీకి సంజాయిషీ నోటీసు ఇవ్వకపోవడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల బరిలో నిలిచిన అర్వింద్ను ఈసీ బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేస్తూనే ఉన్నా.. మెండోరా ఘటనపై స్పందన కరువైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గత నెలన్నర వ్యవధిలో పలువురు జర్నలిస్టులపై ఎంపీ అర్వింద్ నోరు పారేసుకున్నారు. ప్రెస్మీట్కు ఆహ్వానాలు పంపించి, కవరేజీకి వచ్చిన వారిపై నోటికొచ్చినట్లుగా మాట్లాడడంతో జర్నలిస్టుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. సార్వత్రిక ఎన్నికల అంశంపై ఓ సీనియర్ జర్నలిస్టు ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో అసహ్యంగా మాట్లాడిన తీరు వివాదాస్పదమైంది. దీక్షలో ఉన్న సదరు జర్నలిస్టుపై అర్వింద్ వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
చివరకు ఎన్నికల వేళ ముప్పు ఏర్పడుతుందని భావించి అర్వింద్ స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంతకుమునుపు కూడా ప్రెస్మీట్లో ప్రశ్నలు అడిగిన పలువురికి ఇదే తీరులో పరాభవం ఎదురైంది. ఒకరిద్దరు కాకుండా పలువురు విలేకర్లు సైతం ఎంపీ బాధితులుగా మారారు. ప్రెస్మీట్ అంటేనే ప్రశ్నల పరంపరను ఎదుర్కొనడం. కానీ ప్రతికూల ప్రశ్నలు ఎదురైనప్పటికీ సవ్యంగా, ఓపికగా సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత నేతల ధర్మం. ఎంపీ అర్వింద్ ఈ మౌలిక ధర్మాన్ని మరవడంపై వివిధ సంఘాలు సైతం తీవ్రంగా ఖండించగా, నిజామాబాద్ ప్రెస్క్లబ్ వాట్సాప్ గ్రూపుల్లోనూ ఎంపీ వైఖరిపై చాలా మంది దుమ్మెత్తి పోశారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల పేరుతో జనాన్ని నమ్మించి బురిడీ కొట్టించిన కాంగ్రెస్కు లోక్సభ ఎలక్షన్లు కత్తి మీద సాములా మారాయి. ఎక్కడికెళ్లినా హామీలపై నిలదీతలే ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి తలపోటుకు గురిచేసే రెండు సంఘటనలు ఇబ్బందికి గురిచేశాయి. ఇందల్వాయి మండలం గన్నారంలో ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డికి నిరసన సెగ తగిలింది. ఆరు గ్యారంటీల అమలు ఏమైందంటూ జనం ప్రశ్నించడంతో కంగు తినాల్సి వచ్చింది. జనాల ఆగ్రహాన్ని గమనించి వారిని సముదాయించడానికి నేతల తల ప్రాణం తోకకొచ్చినట్లు అయ్యింది.
ప్రచార పర్వంలో హస్తం పార్టీకి పలు చోట్ల రైతులు సైతం రైతుబంధు, రుణమాఫీ, క్వింటాలు ధాన్యానికి రూ.500 బోనస్, మహిళలకు రూ.2500 నగదు సాయం, పింఛన్లు రూ.4000 అమలుపై ప్రశ్నల వర్షం ఎదురవుతుండడం విశేషం. ఇక, కేసీఆర్ హయాంలో రెంజల్ నుంచి బ్రాహ్మణపల్లికి తారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పనులు నిలిచిపోయాయి.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు రెంజల్లోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ వల్లే ఆగిపోయిన పనులను వెంటనే ప్రారంభించక పోతే తగిన బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు. దీంతో దిగి వచ్చిన ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి రోడ్డు నిర్మాణ పనులు చేపడతామని ప్రకటించాల్సి వచ్చింది. ఇలా ఎక్కడికక్కడ జనం జాతీయ పార్టీలను నిలదీస్తుండడంతో జవాబు చెప్పలేక అభ్యర్థులు సతమతమవుతున్నారు. ఆయా పార్టీల ముఖ్య నాయకులు సైతం నోరు విప్పేందుకు జంకుతున్నారు. పోలింగ్కు గడువు సమీపిస్తుండడం, ప్రచారానికి వెళ్తే పరాభవం ఎదురవుతుండడంతో కాంగ్రెస్, బీజేపీ దిగువ స్థాయి నాయకత్వానికి పాలుపోవడం లేదు.