Cheetah | ఇప్పుడంటే మన ఇండ్లలో కుక్కలు, పిల్లులను పెంచుకుంటున్నాం.. కానీ మన తాత ముత్తాల కాలంలో వేటిని పెంచుకునే వాళ్లో తెలుసా! క్రూర మృగాలైన చీతాలను!! ఏంటి నమ్మలేకపోతున్నారా !! కానీ అదే నిజం !! మేకలు, గొర్రెలను మనం ఇంటి ముందు కట్టేసినట్టుగానే మన ముత్తాతలు చీతాలను ఇంటి ముందు ఉంచుకునేవాళ్లంట. జంతువులను వేటాడేందుకు వేట కుక్కల్లా వాటిని చూసేవాళ్లంట !! కేంద్ర ప్రభుత్వం నమీబియా నుంచి ఎనిమిది చీతాలను భారత్కు తీసుకొచ్చిన నేపథ్యంలో ఇప్పుడీ విషయం వైరల్గా మారింది. అసలు చీతాలను మనవాళ్లు పెంపుడు జంతువుల్లా ఎలా పెంచుకోగలిగారు? భారతీయులతో కలిసిపోయిన ఈ చీతాలు మన దేశంలో అంతరించిపోవడానికి కారణమేంటి? వంటి విషయాలు ఒకసారి చూద్దాం..
మనం ఇప్పుడు కుక్కలను ఎలా పెంచుకుంటున్నామో.. అప్పట్లో అడవుల్లో నుంచి తీసుకొచ్చి చీతాలను చూసుకునేవారు. జింకలు, దుప్పులను వేటాడేందుకు వెళ్లినప్పుడు ఈ చీతాలను ఉపయోగించేవాళ్లు. ఇందుకోసం వేటకు వెళ్లేముందు ఆ చీతాల కళ్లకు గంతలు కట్టి ఎడ్లబండిపై అడవులకు తీసుకెళ్లేవారు. జింకలు, దుప్పులు ఉన్న ప్రాంతాల్లో కళ్లగంతలు విప్పి వాటిని వదిలేసేవారు. అప్పుడు చీతాలు వేగంగా పరుగెత్తుకెళ్లి జింకలు, దుప్పులను పట్టుకునేవి. అప్పుడు వాటి యజమానులు వెళ్లి జింకలు, దుప్పులను చంపి మాంసం తెచ్చుకునేవారు. అందులో కొంత మాంసాన్ని జీతాలకు పెట్టేవారు. ఈ విషయం నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ ఇది వాస్తవం. 1939లో వైల్డర్నెస్ ఫిలింస్ ఇండియా లిమిటెడ్ తీసిన ఫొటోలు, వీడియోల్లో ఇవన్నీ స్పష్టంగా రికార్డయ్యాయి కూడా. దీనికి సంబంధించిన ఫొటోలను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్ ట్విట్టర్లో పెట్టడంతో ఈ విషయం ఇప్పుడు వైరల్గా మారింది.
When #Cheetah are coming back to #India. A look at how the last of the lots were hunted, maimed and domesticated for hunting parties. Video made in 1939. 1/n pic.twitter.com/obUbuZoNv5
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 16, 2022
చీతాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. అనవసరంగా ఎవరిపైనా దాడి చేయవు. ఇవి రెండు నుంచి ఐదు రోజులకు ఒకసారి మాత్రమే ఆహారాన్ని తీసుకుంటాయి. దాదాపు 15 కిలోల మాంసం వీటికి సరిపోతుంది. మళ్లీ ఆకలి అయినప్పుడు మాత్రమే మాంసం కోసం వేటాడుతాయి. అది కూడా ఒక మోస్తరు పరిమాణంలో ఉండే జింకలు, దుప్పులు, అడవి పందులు వంటి జంతువులనే ఇవి వేటాడేందుకు ఇష్టపడతాయి.
అప్పట్లో జింకలు, దుప్పులను వేటాడేందుకు చీతాలను తీసుకెళ్లేవారు. అయితే నాటి రాజులు, బ్రిటీషర్లు గొప్పలు చెప్పుకోవడం కోసం.. వాళ్ల సరదా కోసం చీతాలను కూడా వేటాడేవారు. పెంపుడు చీతాల సాయంతో హంటింగ్ పార్టీలను జరుపుకునేవారు. ఒక్క చీతాలనే కాదు.. పులులు, సింహాలు, చిరుత పులులు, అడవి ఏనుగులు ఇలా చాలా జంతువులను వేటాడి చంపేవారు. దీనివల్ల చీతాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. పైగా చీతాల పిల్లల్లో మరణాల రేటు కూడా అధికం. పుట్టిన వారాల్లోనే 90 శాతానికి పైగా మృత్యువాత పడుతుంటాయి. ఈ రెండు కారణాల వల్ల చీతాలు ఎక్కువ రోజులు మనుగడ సాధించలేకపోయాయి. దీంతో క్రమక్రమంగా భారత్లో చీతాలు అంతరించిపోయాయి. మన దేశంలో ఆసియన్ చీతాలు అంతరించిపోయాయని 1952లో అధికారికంగా ప్రకటించారు.
శత్రువులను అడ్డుకోవాలన్న తపనలో.. పొరపాటున వాళ్ల దేశంలోనే కోట కట్టారు