ఆయన ఓ ఊరి పెద్ద.. అతను భారత్లో భోజనం చేస్తాడు.. మయన్మార్లో నిద్ర పోతాడు.. అలా అని రోజంతా ఆయన రెండు దేశాల మధ్య తిరుగుతూనే ఉంటాడనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆయన ఇల్లు సగం భారత్లో ఉంటే మరో సగం మయన్మార్లో ఉంది. ఇదేం విచిత్రం అని అనుకుంటున్నారా.. అసలు విషయంలోకి వెళ్తే.. భారత్, మయన్మార్ దేశాల సరిహద్దు రేఖ సరిగ్గా వాళ్ల ఇంటి మధ్యలో నుంచి వెళ్లింది. దీంతో వాళ్ల ఇంటి కిచెన్ భారత్లో ఉంటే.. బెడ్రూం మయన్మార్ దేశంలోకి వెళ్లింది. ఇలా ఆ గ్రామ పెద్దదే కాదు.. చాలామంది పరిస్థితి అలాగే ఉంది. అదే ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్కు ఉత్తర భాగంలో మన్ జిల్లాలో ఉన్న లోంగ్వా గ్రామం.
భారత్, మయన్మార్ దేశాల సరిహద్దులో ఉన్న లోంగ్వా గ్రామం.. ఆ రెండు దేశాల కిందకు వస్తుంది. ఈ గ్రామంలో కొణ్యక్ గిరిజన తెగకు చెందిన ప్రజలు జీవిస్తుంటారు. వీరికి రెండు దేశాల పౌరసత్వం ఉంది. తమకు ఈ రెండు దేశాలకు పెద్ద తేడా ఏమీ లేదని ఇక్కడి వారు చెబుతుంటారు. ఇక్కడికి యువకులు కొంతమంది మయన్మార్ సైన్యంలో పనిచేస్తుంటే.. మరికొందరు భారత్లో వ్యాపారం కూడా చేస్తున్నారు. ఈ కొణ్యక్ గిరిజన తెగవారిని భారత్లోని అతి పురాతనమైన ‘హెడ్ హంటర్స్’ ఆదివాసీలుగా కూడా పేర్కొంటారు. వీరికి ఓ పెద్ద చరిత్రే ఉంది.
కొన్నేళ్ల కిందటి వరకూ తమ శత్రువులగా భావించే గిరిజన తెగ ప్రజల తలలను నరికి తీసుకురావడం వీరి సంప్రదాయంగా ఉండేది. అలా శత్రువుల తలలు ఎవరు నరికి తీసుకొచ్చిన.. దానికి గుర్తుగా ఆ వ్యక్తి ఒంటిపై పచ్చబొట్టు వేసి సంబరాలు చేసుకునేవారు. కానీ కాలం మారిన కొద్దీ కొణ్యక్ తెగ ప్రజలు మారిపోయారు.
ఇవి కూడా చదవండి..
ఒంటరిగా ప్రయాణిస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ప్రపంచంలోనే అత్యంత చల్లని నగరాలు ఇవే..
వేసవిలో ప్రయాణమా..ఈ చిట్కాలు పాటించండి