Boat capsize : అండమాన్ సముద్రం (Andaman Sea) లో ఘోర ప్రమాదం జరిగింది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో వెళ్తున్న ఓ పడవ నీటిలో మునిగిపోయింది (Boat Capsizes). ఈ ఘటనలో దాదాపు 250 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై ఐక్యరాజ్యసమితి (UNO) శరణార్థుల హైకమిషనర్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంయుక్త ప్రకటన విడుదల చేసింది.
ప్రమాదానికి గురైన పడవ దక్షిణ బంగ్లాదేశ్లోని టేక్నాఫ్ ప్రాంతం నుంచి బయల్దేరినట్లు ఐక్యరాజ్య సమితి తన ప్రకటనలో పేర్కొన్నది. పడవ బంగ్లాదేశ్ నుంచి మలేసియా వెళ్తుండగా బలమైన ఈదురుగాలులు, కెరటాల ఉద్ధృతి కారణంగా మునిగినట్లు వెల్లడించింది. అదేవిధంగా పడవలో పరిమితికి మించి జనం ఎక్కడం కూడా ప్రమాదానికి మరో కారణమై ఉండవచ్చని తెలిపింది. మునిగిన పడవ ఏప్రిల్ 4న బంగ్లాదేశ్ నుంచి బయల్దేరినట్లు తెలుస్తోంది. కాక్స్ బజార్లోని శరణార్థుల శిబిరాల్లో ఉన్న వీరు కనీస జీవన సదుపాయాల కోసం మలేసియాకు వలస వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదానికి గురైనట్లు ఐక్యరాజ్యసమితి అధికారులు వెల్లడించారు.
వాస్తవానికి రోహింగ్యాలు మయన్మార్కు చెందినవారు. కానీ 2017లో అక్కడి సైన్యం మారణహోమం నుంచి తప్పించుకునేందుకు లక్షలాది మంది బంగ్లాదేశ్కు తరలిపోయారు. దాంతో కాక్స్ బజార్లో శరణార్థి శిబిరాలు కిక్కిరిసిపోయాయి. అయితే ఇటీవల అక్కడి పరిస్థితులు కూడా క్షీణించడంతో వారంతా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు వలసబాట పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదకర సముద్ర ప్రయాణాలను వారు ఎంచుకుంటున్నారు.