Masoud Pezeshkian : ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఇండియాలో పర్యటించనున్నారు. సెప్టెంబర్లో ఇండియాలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు పెజెష్కియన్ హాజరవుతారు. ఈ ఏడాది జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ఇండియా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో బ్రెజిల్ నుంచి ఇండియా ఆతిథ్య హోదా అందుకుంది. తాజా సదస్సుకు సంబంధించి.. ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం వేళ పెజెష్కియన్ ఇండియాలో పర్యటించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియాకు ఇజ్రాయెల్ అత్యంత మిత్ర దేశం.
అలాగే, ఇరాన్తోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. ఇజ్రాయెల్తో యుద్ధంలో భారత్ వ్యవహరించిన వైఖరిపై ఇరాన్ సంతృప్తితో ఉంది. అటు, ఇరాన్తో, ఇటు ఇజ్రాయెల్తో భారత్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేలా చేయడంలో ఇండియా కీలక పాత్ర పోషించగలదు అని ఇటీవల ఇరాన్ వ్యాఖ్యానించింది. అయితే, ఉద్రిక్తత ఇంకా కొనసాగుతున్న పరిస్థితుల్లో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ ఇండియాలో పర్యటించనుండటం కీలక పరిణామంగా చెప్పుకోవాలి. న్యూఢిల్లీలో భారత్ ఆధ్వర్యంలో 18వ బ్రిక్స్ సదస్సు సెప్టెంబర్లో జరగనుంది. ఈ సదస్సుకు మొత్తం 11 సభ్య దేశాలు హాజరవుతాయి. ఇందులో ఇరాన్ 2024లో సభ్యదేశంగా చేరింది. అప్పుడు రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్.. భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇప్పుడు మరోసారి ఇరువురూ ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశం ఉంది. బ్రిక్స్ సదస్సు కోసం గత జూన్లో ఇండియా సన్నాహక సమావేశం నిర్వహించింది. బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఆ సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కూడా ఇండియా వచ్చారు. ఇరాన్ తర్వాత 2025లో ఇండోనేసియా చేరింది. ఈజిప్ట్, ఇథియోపియా, యూఏఈ కూడా సభ్యులుగా ఉన్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా బ్రిక్స్ సదస్సుకు హాజరుకానున్నారు.