ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యమే పరమావధా?.. కార్పొరేట్లకు కొమ్ము కాయడమే కర్తవ్యమా?.. అందినకాడికి అమ్ముకోవడమే లక్ష్యమా?.
గత పదేండ్లలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తీరు ఇలాగే ఉందన్న విమర్శలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి మరి. ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తూ సాగిన ఈ దశాబ్దకాల పాలనలో ఎయిర్ ఇండియా వంటి ప్రతిష్ఠాత్మక సర్కారీ కంపెనీలు కనుమరుగైపోయాయన్నది నిజం.
దేశ బ్యాంకింగ్ వ్యవస్థనూ వదల్లేదు. ఒకప్పుడు 27 ప్రభుత్వ బ్యాంకులుంటే ఇప్పుడు 12కు పడిపోయాయి. చివరకు బ్యాంకింగ్ రంగ నియంత్రిత సంస్థగా ఉన్న ఆర్బీఐనీ వెంటాడి, డివిడెండ్ల పేరుతో బలహీనపర్చాలని చూడటం.. ప్రభుత్వ పెద్దలకు, ఆర్బీఐ గవర్నర్లకు మధ్య విబేధాల్ని తెచ్చిపెట్టింది.
PM Modi | న్యూఢిల్లీ, మే 2: కుదిరితే ఒక్కసారిగా అమ్మేయడం.. కుదరకపోతే విడుతలవారీగా వాటాలను విక్రయించడం.. మొత్తానికి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ బాట పట్టించడమే లక్ష్యంగా గత పదేండ్ల మోదీ సర్కారు పాలన సాగింది. 2014-15 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ రూ.4.26 లక్షల కోట్లుగా ఉన్నది. 2017-18లో అత్యధికంగా లక్ష కోట్ల రూపాయలపైనే ఆదాయం వచ్చింది. నిజానికి బడ్జెట్లో పెట్టుకున్న లక్ష్యాలు నెరవేరితే.. పెట్టుబడుల ఉపసంహరణలు రూ.10 లక్షల కోట్లు దాటేవే.
ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఏటా డివిడెండ్ల రూపంలో అందుకున్నదే ఈ పదేండ్లలో రూ.15 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. ఒక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచే ఇందులో సగం వచ్చిందని గణాంకాలు చెప్తున్నాయి. 2018-19లో ఏకంగా రూ.1,76,051 కోట్ల డివిడెండ్ను ఆర్బీఐ నుంచి కేంద్ర ప్రభుత్వం అందుకున్నది. ఇదే ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్తో కేంద్రం గొడవలు తారాస్థాయికి చేరిన సంగతీ విదితమే. ఆర్బీఐ నగదు నిల్వలపై మోదీ సర్కారు కన్నేయడంతోనే పటేల్ తన పదవీకాలం ముగియకుండానే వెళ్లారన్నది చాలామంది అభిప్రాయం. ఈ క్రమంలోనే ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ వచ్చారు.
ఇక గౌతమ్ అదానీతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్నేహ బంధం.. పెద్ద దుమారాన్నే రేపింది. విదేశాల్లో అదానీ సంస్థలకు లాభం చేకూర్చేందుకు ప్రభుత్వం తరఫున మోదీ సహకారం అందించారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో హిండెన్బర్గ్ రిసెర్చ్ రిపోర్టు ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పనక్కర్లేదు. అదానీ సంపదలో మూడింతలు కరిగిపోయింది. ఇక దేశీయంగానూ అదానీ గ్రూప్నకు మోదీ పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించారన్నది చాలామంది మాట. మొత్తానికి కార్పొరేట్ల పక్షానే మోదీ ఉంటారన్న వాదనలకు బలం చేకూరుస్తూ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ, స్పెక్ట్రమ్ వేలాలు నిలుస్తున్నాయి. ఆయా రంగాల్లోని ప్రభుత్వ సంస్థలను కేంద్రం ఉద్దేశపూర్వకంగానే బలహీనపరుస్తున్నదన్న విమర్శలూ అటు ఆర్థిక నిపుణుల నుంచి ఇటు రాజకీయ వర్గాల నుంచి వస్తున్నాయి.