భువనేశ్వర్ : ఓ వైపు కరోనా మహమ్మారి.. మరో వైపు తుఫాన్లు ఒడిశాపై ముప్పేట దాడులు చేస్తున్నాయి. ఇటీవల వరుస తుఫాన్లు తీవ్ర నష్టాన్ని కలిగించగా.. కరోనా పంజా విసురుతోంది. ఈ క్రమంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఉన్నత పాఠశాలలు, కాలేజీల్లో పాఠ్యాంశాలుగా విపత్తు, మహమ్మారి నిర్వహణను చేర్చాలని ప్రభుత్వం శనివారం నిర్ణయించింది. బీజేడీ నేత ఐదోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం నవీన్ పట్నాయక్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించగా.. ఈ మేరకు ఈ విషయంపై తీర్మానాన్ని ఆమోదించారు.
బీజేడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఐదోసారి ఎంపికయ్యేందుకు ముందే 2019, మేలో తుఫాను ఎదుర్కొన్నామని, అప్పటి నుంచి గత రెండేళ్లుగా తుఫాన్లు, కొవిడ్ మహమ్మారి సవాళ్లను ఎదుర్కొంటున్నామని సీఎం పేర్కొన్నారు. సంక్షోభ సమయంలో మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. తరచూ తుఫానులు, మహమ్మారి వంటి విపత్తులతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని మంత్రి మండలి పిలుపునిచ్చింది. గతంలో విపత్తులతో భారీగా నష్టపోయిందని, నేడు విపత్తు నిర్వహణ ఒడిశా మోడల్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను పొందుతుందని తీర్మానంలో పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరినీ యోధులుగా తీర్చిదిద్దే భారీ జ్ఞాన మౌలిక సదుపాయాలను రాష్ట్రంలో కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని, భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలని, ఎలా స్పందించాలో ప్రజలకు పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇక నుంచి ప్రతి హైస్కూల్, కాలేజీ విద్యార్థి పాఠ్యాంశాల్లో భాగంగా విపత్తు, మహమ్మారి నిర్వహణ గురించి నేర్చుకుంటారని సీఎం తెలిపారు. ప్రాథమికంగా ఒడిశాలోని ప్రతి ఇంటిలో యోధుడు ఉండడమే లక్ష్యమని పేర్కొన్నారు.