హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లోని మరో 1,000 ఆలయాలకు ధూప దీప నైవేధ్య పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 1,588 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం మంజూరు కాగా, ఆలయ నిర్వాహకుల నుంచి స్పందన రాలేదు. దీంతో జీహెచ్ఎంసీకి మంజూరైన 1,588 ఆలయాల్లో నుంచి 1,000 ఆలయాలను తగ్గించి ఈ మేరకు గ్రామీణ ప్రాంత ఆలయాలకు పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని 3,645 ఆలయాలకు ధూప దీప నైవేధ్య పథకం అమలవుతుండగా, ఇటీవలే ప్రభుత్వం కొత్తగా మరో 1,160 ఆలయాలకు మంజూరు చేసింది. ఇది కాకుండా జీహెచ్ఎంసీ పరిధిలోని 1,588 ఆలయాలకు కూడా ఈ పథకాన్ని మంజూరుచేసి దరఖాస్తులు ఆహ్వానించగా, ఆలయ నిర్వాహకుల నుంచి సరియైన స్పందన రాలేదు. ధూప దీప నైవేధ్య పథకం కింద ఆదాయం లేని ఆలయాలకు ప్రతి నెలా రూ. 6,000 చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది. ఇందులో రూ. 2,000 ధూప దీప నైవేద్యాలకు, మిగిలిన రూ. 4,000 అర్చకులకు చెందుతుంది.