న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే 32 కేసులు నమోదవగా, తాజాగా న్యూఢిల్లీలో మరో కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో మొత్తం కేసులు 33కు చేరాయి. జిబాంబ్వే నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం అతడు లోక్ నాయక్ జయ్ ప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్ (ఎల్ఎన్జేపీ)లో చికిత్స పొందుతున్నారు. అతడు ఈ మధ్యే దక్షిణాఫ్రికాకు వెళ్లివచ్చినట్లు తెలుస్తున్నది.
ఢిల్లీకి వచ్చిన 27 మంది విదేశీ ప్రయాణికుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించామని అధికారులు తెలిపారు. అందులో 25 మందికి నెగెటివ్ వచ్చిందని, ఇద్దరికి మాత్రం ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. కాగా, ఢిల్లీలో మొదటి కేసు నమోదైనప్పుడే మరిన్ని కేసులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో 17 నమోదవగా, రాజస్థాన్ 9, గుజరాత్ 3, కర్ణాటక 2, ఢిల్లీలో 2 చొప్పున ఉన్నాయి.