న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సహా ఏడు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు వెయ్యి కన్నా తక్కువగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. సోమవారం ఆయన దేశంలో కొవిడ్ పరిస్థితిపై మంత్రుల బృందం సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, జార్ఖండ్లో వెయ్యికన్నా దిగువన ఉన్నాయన్నారు. వైరస్ యాక్టివ్ కేసులు సోమవారం నాటికి దేశంలో 14,01,609 ఉన్నాయని చెప్పారు. జాతీయ రికవరీ రేటు నిరంతరం పెరుగుతుందని చెప్పారు. యాక్టివ్ కేసుల్లో 80శాతం పది రాష్ట్రాల్లోనే ఉన్నాయని, మిగిలిన 17 శాతం 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపారు.
జమ్మూ కాశ్మీర్, పంజాబ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్లో రెండువేల కన్నా తక్కువగా వైరస్ కేసులున్నాయన్నారు. ఎక్కువ ప్రభావితమైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కేసుల సంఖ్య తగ్గుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా.. 24 గంటల్లో 1,00,636 కొత్తగా కరోనా కేసులు వెలుగు చూడగా.. 1,74,399 మంది బాధితులు కోలుకున్నారు. మరో 2,427 మంది వైరస్ బారినపడి మృతి చెందారని ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 14,01,609 క్రియాశీల కేసులున్నాయని పేర్కొంది.