హైదరాబాద్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు సీఎం రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేత రాకేశ్రెడ్డి డి మాండ్ చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం క్షమాపణలు చెప్పకుంటే వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచి లక్ష మంది విద్యార్థులతో నామినేషన్ వేయిస్తామని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మేటి కంపెనీల్లో తెలంగాణ ఇంజినీరింగ్ విద్యార్థులు తమ ప్రతిభను చూపుతున్నారని, అలాంటి వారిని క్రిమినల్ వేస్ట్ అనడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. హార్వర్డ్ వెళ్లి వారం రోజులు శిక్షణ తీసుకున్నా, ముఖ్యమంత్రిలో ఎలాంటి మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి కారణంగా రియల్ ఎస్టేట్ పడిపోయాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న ఇలాంటి ప్రకటనలతో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యధికంగా 89 క్రిమినల్ కేసులున్న సీఎం రేవంత్రెడ్డే అసలైన క్రిమినల్ అని విమర్శించారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్కుమార్ విమర్శించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాలతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య ఏపీలో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదని మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. ఏపీలో ఇస్తేనే మన రాష్ట్రంలో రీయింబర్స్మెంట్ ఇస్తారా? అని నిలదీశారు. కొత్త జీవోలతో సమస్యను మరింత క్లిష్టం చేయకుండా వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు సూచించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ఇంజినీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్” అని స్వయంగా సీఎం మాట్లాడటం సరికాదని, వెంటనే వారికి క్షమాపణలు చెప్పాలని రాకేశ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే అనేక మంది ఇంజినీరింగ్ చదివిన ఐఏఎస్ అధికారులు పనిచేస్తున్నారని, ఇంజినీరింగ్ విద్యను తకువ చేసి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. సీఎం రేవంత్ గురుకులాల్లో సమస్యలను పరిషరించలేకపోయారని, విద్యార్థుల మరణాలపై సమీక్షలు కూడా నిర్వహించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు, ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
‘క్రిమినల్ వేస్ట్’ అంటూ విద్యార్థులను అవమానించిన సీఎం రేవంత్రెడ్డి పట్టభద్రులకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో నాణ్యమైన ఇంజినీర్లు తయారైనందుకే అనేక కంపెనీలు తెలంగాణకు తరలివచ్చాయని పేర్కొన్నారు. జాతీ య, అంతర్జాతీయ సంస్థలకు అడ్డాగా హైదరాబాద్ మారిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక సీఎం రేవంత్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.