Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తాజాగా కోర్టును ఆశ్రయించారు. జైల్లో తనకు షుగర్ లెవెల్స్ పెరుగుతున్న కారణంగా ఇంజక్షన్లు ఇవ్వాలంటూ రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court)లో పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన కేజ్రీ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే, జైల్లో ఆయనకు షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి. దీంతో తనకు ఇంజక్షన్లు ఇవ్వాల్సిందిగా (provide insulin in jail) కోర్టును కేజ్రీవాల్ కోరారు. ఈ మేరకు శుక్రవారం పిటిషన్ దాఖలు చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) వెల్లడించింది. కేజ్రీ పిటిషన్పై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనున్నట్లు తెలిపింది.
Delhi CM Arvind Kejriwal filed a petition in Rouse Avenue Court to provide insulin in jail. The court will hear Kejriwal’s petition at 2 pm: Aam Aadmi Party
— ANI (@ANI) April 19, 2024
కాగా, మధుమేహంతో బాధ పడుతున్న కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవెల్ ఏప్రిల్ 14 నాటికి 276 ఎంజీ/డీఎల్గా నమోదైంది. దీంతో వైద్యుడిని కలిసేందుకు అనుమతించాల్సిందిగా కేజ్రీవాల్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం కోర్టు విచారణ జరిపింది. అయితే, ఈ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. విచారణ సందర్భంగా కేజ్రీవాల్పై పలు ఆరోపణలు చేసింది. ‘ఇంటి భోజనానికి కేజ్రీవాల్కు అనుమతి ఉన్నది. దీంతో ఇష్టమైన ఆహారం తినేసి.. తద్వారా షుగర్ లెవెల్స్ పెంచుకొని, ఆరోగ్యపరమైన కారణాలతో బెయిల్ పొందాలని కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు’ అని ఈడీ మండిపడింది.
అయితే, ఈడీ ఆరోపణలను కేజ్రీవాల్ న్యాయవాది తిప్పికొట్టారు. మీడియా ప్రచారం కోసం ఈడీ ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నదని మండిపడ్డారు. దీంతో కేజ్రీవాల్ తీసుకోవాల్సిన డైట్ వివరాలు ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదిని, జైలులో ఇస్తున్న ఆహార వివరాలు అందించాలని తీహార్ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.
కృత్రిమ చక్కెరను వాడుతున్నారు
ఈడీ చేసిన ఆరోపణలను ఆప్ నేతలు సైతం ఖండించారు. ‘మధుమేహ రోగులకు సిఫారసు చేసే కృత్రిమ చక్కెరను మాత్రమే కేజ్రీవాల్ వాడుతున్నారు. మధుమేహ రోగులకు షుగర్ స్థాయిలు ఎప్పుడైనా పడిపోవచ్చు. అందుకే అరటిపండ్లు, చాక్లెట్ల వంటివి దగ్గర పెట్టుకోవాలని వైద్యులే సలహా ఇస్తారు. దాన్ని కూడా ఈడీ తప్పుగా చిత్రీకరించి అసత్యాలు వల్లెవేస్తున్నది’ అంటూ ఆతిశీ మండిపడ్డారు.
Also Read..
PM Modi | అధిక సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు మోదీ పిలుపు
Lok Sabha Elections | ముందుగా నేనే ఓటేయాలనుకున్నా.. కానీ ఓటర్లను చూసి షాకయ్యా : మేఘాలయా సీఎం