Lok Sabha Elections | దేశంలో సార్వత్రిక ఎన్నికలు (Lok Sabha Elections) శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సాధారణ పౌరులతోపాటు ప్రముఖులు కూడా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివెళ్తున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాకముందే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు.
మేఘాలయా ముఖ్యమంత్రి (Meghalaya Chief Minister) కాన్నాడ్ కె సంగ్మా (Conrad K Sangma) సైతం లోక్సభ ఎన్నికల తొలి విడతలో ఓటు వేసేందుకు ఉదయం 6:30 గంటలకే తురాలోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అయితే, ప్రజలు అప్పటికే క్యూలైన్లో ఉండటం చూసి ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యారు. ముందుగా తాను ఓటు వేయాలని భావించినట్లు చెప్పారు. అయితే, తన కంటే ప్రజలే ముందు వెళ్లి క్యూలో నిలబడటం తనని ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ‘నేను ముందుగా ఓటు వేయాలని భావించి ఉదయం 6:30 గంటలకే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నా. కానీ, నా కంటే ముందు చాలా మంది ఉండటం నన్ను ఆశ్చర్యపరిచింది. ఇది మంచి ధోరణి. ఓటు వేయడం ప్రతి పౌరుడి హక్కు. ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి ఓటు వేసి తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆయన అన్నారు.
కాగా, సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఇవాళ తొలి విడత పోలింగ్ (Polling) జరుగుతోంది. మొదటి దశలో 102 స్థానాలకు గానూ మేఘాలయాలో రెండు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అందులో తురా, షిల్లాంగ్ స్థానాలు ఉన్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది.
ఇక తొలి విడత ఎన్నికల్లో మొత్తం 1,625 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 1491 మంది పురుషులు కాగా, 134 మంది మహిళా అభ్యర్థులు. మొత్తం 16.63 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి.
Also Read..
Rahul Gandhi | ఓటు దేశభవిష్యత్తును నిర్ణయిస్తుంది : రాహుల్ గాంధీ
PM Modi | అధిక సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు మోదీ పిలుపు
Israel – Iran | అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్పై క్షిపణులతో ప్రతీకార దాడి